హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్న శుభసందర్భంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన ఈ సందర్భంలో ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోషపడాలని అన్నారు. వ్యవసాయం, సాగు నీరు, విద్యుత్తు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజురోజుకు గుణాత్మక అభివృద్ధిని నమోదుచేసుకొంటున్నదని సీఎం తెలిపారు.
అందుకు కేంద్రం సహా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు, రివార్డులు, ప్రశంసలే సాక్ష్యమని వెల్లడించారు. పలు విధాలుగా పథకాలను అమలుచేస్తూ ఎనిమిదేండ్ల అనతికాలంలో ఊహించనంత సంక్షేమం, అభివృద్ధిని సాధించామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి నేడు దేశానికే పాఠం నేర్పుతున్నదని వివరించారు. అత్యంత పారదర్శకతతో కూడిన ఆర్థిక క్రమశిక్షణతో, ప్రజా సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు.
ప్రజల మేలు కోసం దృఢమైన రాజకీయ సంకల్పంతో తీసుకొంటున్న ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో అమలు చేస్తున్న కార్యాచరణ, అంతకు మించిన ప్రజల సహకారం.. అన్నీ కలుపుకొని ఇంతటి ఘన విజయానికి బాటలు వేశాయని చెప్పారు. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆటంకం కలిగిస్తున్నా, మొకవోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.