Telangnaa | ‘సర్కారు బడికి పోతే సక్కని సదువు చెబుతారు.. కడుపు నిండా బువ్వ పెడతారు’ అనే నమ్మకం తల్లిదండ్రుల్లో బలంగా నాటుకున్నది. పాఠశాల విద్యకు కేసీఆర్ సర్కారు పెద్దపీట వేయడమే ఇందుకు కారణం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాఠశాలల్లో వసతులను మెరుగుపరిచింది. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యను ప్రవేశపెట్టింది. పిల్లలకు చదువుతో పాటు చక్కని పౌష్టికాహారం కూడా అందిస్తున్నది. పదేండ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగా నేడు రాష్ట్ర విద్యారంగంలో అనేక మార్పులొచ్చాయి. సమైక్య పాలనలో విద్యార్థులు లేక మూతబడ్డ ప్రభుత్వ బడులు ఇప్పుడు పిల్లలతో కళకళలాడుతున్నాయి.
ఉదయం వచ్చింది మొదలు సాయంత్రం ఇంటికెళ్లే వరకు చక్కటి చదువుతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తారు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రాగి జావ ఇస్తారు. ఇక విద్యార్థి ఇంట్లో తినేది రాత్రి భోజనం మాత్రమే. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో స్నాక్స్ కూడా ఇస్తారు. తల్లిదండ్రులకు ఎలాంటి ఫీజుల భారమూ లేదు. ఉచితంగా మల్టీకలర్ యూనిఫారాలు, ఆకట్టుకునేలా ఉన్న మల్టీకలర్ పాఠ్యపుస్తకాలు అందిస్తారు. ఇదీ తెలంగాణ సర్కారు బడుల్లో విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చొరవ. ఈ పదేండ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చొరవతో రాష్ట్ర విద్యారంగంలో అనేక మార్పులొచ్చాయి. ఇవన్నీ గుణాత్మక మార్పులు. వీటి ఫలితాలు క్రమంగా అందుతున్నాయి. సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలను పెంచింది ప్రభుత్వం.
గత ఏడాది రాష్ట్రంలోని 26 వేల బడులల్లో 1 నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లిష్ మీడియం చదువులకు శ్రీకారం చుట్టారు. ఆంగ్ల మాధ్యమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి వరకు విస్తరించారు. వచ్చే ఏడాది పదో తరగతిలో కూడా ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి వస్తాయి. గతంలో రాష్ట్రంలోని 462 స్కూళ్లల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉండేది. తెలుగుకు సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు పలు స్కూళ్లకు అనుమతులివ్వగా, వాటి సంఖ్య 2 వేలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 26 వేల బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పాఠశాలలే నేడు పేద వర్గాల విద్యార్థులకు ఆశాదీపాలు అయ్యాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 8,792 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. స్కూల్ అసిస్టెంట్లు 1,745, ఉర్దూ మీడియం స్కూల్ అసిస్టెంట్లు 196, సెకండరీ గ్రేడ్ టీచర్లు 4,779, ఉర్దూ మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్లు 636, భాషా పండితులు 985, ఉర్దూ మీడియం భాషా పండితులు 26, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 374 మరో 61 పోస్టులను భర్తీ చేసింది. తాజాగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి గత నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఒకేరకమైన దుస్తులు ఉండేలా ప్రభుత్వమే ఒక్కో విద్యార్థికి రూ.600ల చొప్పున వెచ్చించి రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందజేస్తున్నది. ఇందుకు ఏడాదికి రూ.108 కోట్లను ఖర్చు చేస్తున్నది.
దేశంలోని ఒకట్రెండు రాష్ర్టాలు మినహా మిగతా అన్ని రాష్ర్టాలు 1-8వ తరగతుల విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 9, 10 తరగతుల వారికి కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నది. ఈ పథకంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ర్టాలు పిల్లల కు దొడ్డుబియ్యం బువ్వ పెడుతుండగా, ఒక్క తెలంగాణ రాష్ట్రమే సన్నబియ్యం అన్నం పెడుతు న్నది. 17.52 లక్షల మంది విద్యార్థులకు సన్నబువ్వతో పాటు, అరటిపండ్లు, కోడిగుడ్లను అందజే స్తున్నది. మధ్యాహ్న భోజనానికి 1 నుంచి 8వ తరగతుల వరకు గల విద్యార్థులకయ్యే వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున ఖర్చును భరిస్తుం డగా, తెలంగాణ సర్కారు ఒక అడుగు ముందుకేసి 9, 10 తరగతుల విద్యా ర్థులకు 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధు లతో మధ్యాహ్న భోజనాన్ని సమకూరుస్తున్నది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వారానికి 3 ఉడకబెట్టిన కోడిగుడ్ల చొప్పున, నెలకు 12 కోడిగుడ్లు, రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందిస్తున్నది.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఒకటి నుంచి 5 తరగతుల కోసం ‘తొలిమెట్టు’, 6 నుంచి 9 తరగతుల వారి కోసం ‘లర్నింగ్ ఇంప్రూవ్మెంట్’, 10వ తరగతి విద్యార్థుల కోసం ‘లక్ష్య’ కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. విద్యార్థులను భవిష్యత్తులో స్టార్టప్ ఫౌండర్లుగా తయారు చేసేందుకు ‘అంకుర’ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్లు, స్టెమ్ ల్యాబ్లను పెద్ద ఎత్తున నెలకొల్పింది. డిజిటల్ బోధనలో భాగంగా ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను బడులకు అందించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని 1.2 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి రూ.2 వేలు, 25 కిలోల బియ్యాన్ని మూడు నెలలపాటు అందజేసింది.
సర్కారీ స్కూళ్లల్లోని 26 లక్షల పైచిలుకు విద్యా ర్థులకు ఏటా రూ.52 కోట్లు ఉచితంగా పాఠ్యపుస్తకా లను అందజేసింది ప్రభుత్వం. గతేడాది నుంచి ద్విభాషా పుస్తకాలను ముద్రిస్తున్నది. దీంతో పాఠ్య పుస్తకాల ఖర్చు రూ.60.44 కోట్లకు చేరుకున్నది.
విద్యార్థులందరికీ ఉచితంగా నోట్బుక్స్, వర్క్బుక్స్ ను అందజేసింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోట్బుక్స్ను అందజేశారు. రూ.34.70 కోట్లను ఖర్చుతో 11.27 లక్షల మంది విద్యార్థులకు మూడు చొప్పున మొత్తంగా 33.82 లక్షల వర్క్బుక్స్ ఇచ్చారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకున్న 12.39 లక్షల మంది విద్యార్థులకు 1.17 కోట్ల నోటుబుక్స్ను ఇవ్వగా, ఇందుకు రూ.56.24 కోట్లను ఖర్చు చేశారు.
ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ఏడాదికి రూ.9 కోట్లు ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు, లైబ్రరీ, స్పోర్ట్స్ వంటి ఫీజులను రద్దు చేసింది.
సర్కారు బడుల భౌతిక స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం మూడు విడతల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మొదటి విడతగా 2022-23 విద్యాసంవత్సరంలో చేపట్టారు. 1,240 బడులు సిద్ధం కాగా, పూర్తయినవి పూర్తయినట్టు ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం మూడు విడతల్లో 3,41,265 డ్యూయెల్ డెస్క్ బల్లలు, 1,39,585 గ్రీన్ చాక్పీస్ బోర్డులను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 200లకు పైగా విద్యార్థులున్న బడులకు సోలార్ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వనుండగా, మొదటి విడతలో 1,521 బడుల్లో సోలార్ ప్యానళ్లు బిగించారు. ప్రభుత్వం ప్రకటించిన 12 అంశాలే కాకుండా పాఠశాలలకు స్వాగత తోరణాలు, గ్రీనరీ, పాత్ వే (నడక దారుల)లను సైతం నిర్మిస్తున్నారు. డిజిటల్ విద్యలో భాగంగా సర్కారు బడుల్లో 13,983 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు అందజేశారు.
…? కొంటు మల్లేశం