బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మిరెడ్డికి బుధవారం బీఫామ్ అందజేస్తున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. చిత్రంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి. మెదక్ ఎంపీ అభ్యర్థిగా మదన్రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మిరెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు. మదన్రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మదన్రెడ్డి తనతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడని పేర్కొన్నారు. 35 ఏండ్ల నుంచి తనతో సన్నిహితంగా ఉంటున్నారని, ఆయన తనకు అత్యంత ఆప్తుడని, కుడి భుజం లాంటివాడని తెలిపారు. సోదర సమానుడైన మదన్రెడ్డి.. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికను తన భుజసందాలమీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. మదన్రెడ్డి కేవలం నర్సాపూర్లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాపులర్ లీడర్ అని, వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరున్న ఆయన సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకుంటుందని చెప్పారు. చిన్నచిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా ఆయన పార్టీ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేశారంటూ కేసీఆర్ అభినందించారు.