CM KCR Full Speech : అద్వితీయ ప్రగతికి అద్దం తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతిని కేవలం 8 ఏండ్లలోనే తెలంగాణ సాధించి దేశానికి మార్గదర్శనం చేసే స్థాయికి ఎదిగిందని ఆయన చెప్పారు. తలసరి ఆదాయంలో…తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్లోని పబ్లిక్గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 8 ఏండ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కళ్ళముందు సాక్షాతరిస్తాయన్నారు. అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందని ఆయన ఉద్విగ్నంగా ప్రకటించారు. ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి..వివిధ రంగాల్లో వచ్చిన గుణాత్మక మార్పు..భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ సవివరమైన సందేశం ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే…
పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో 17.24 శాతం ఆర్థిక వృద్ధిరేటు సాధించాం. ఆర్థిక వృద్ధిరేటు విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, కరోనా వంటి విపత్తులు ఎదురైనా రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా దక్షతకు దక్కిన గుర్తింపు.
2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్డీపీ రూ. 5,05,849 కోట్లు కాగా, 2021-22 నాటికి రూ. 11, 54,860 కోట్లకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది. తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 కాగా, 2021-22 నాటికి అది రూ. 2,78,833 పెరిగింది. జాతీయ సగటు ఆదాయం కన్నా రాష్ట్రం 86 శాతం అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం శుభపరిణామం.
తెలంగాణ కరెంట్ కష్టాలకు చరమగీతం పాడింది. రాష్ట్రంలోని అన్ని రంగాలకూ నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నది. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి గర్విస్తున్నా. రాష్ట్రం ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా ఇవ్వాళ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుంచి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు చేరింది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే మన తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం ఎక్కువ.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ తాగునీటి కోసం తల్లడిల్లింది. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాగునీటి సమస్య పరిషారానికి యుద్ధప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. దీంతో ఇవ్వాళ రాష్ట్రంలో 100 శాతం ఆవాసాలలో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. ఈ పథకాన్ని నేషనల్ వాటర్ మిషన్ అవార్డు వరించింది. మన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇది మనందరికీ గర్వకారణం.
సమైక్యరాష్ట్రంలో వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ వ్యవసాయ రంగం కుదేలైంది. సాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించిన నాకు ఆనాటి రైతాంగం దుస్థితిని చూసి మనసు వికలమైంది. కృష్ణా, గోదావరి నదులు మన ప్రాంతం నుంచి ప్రవహిస్తున్నా సాగునీటికి నోచని రైతుల దుస్థితి చూసి చలించిపోయాను. అందుకే, స్వరాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయరంగం పైనా, రైతుల సంక్షేమంపైన ప్రత్యేక దృష్టిని సారించాను. రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, పథకాలూ అమల్లోకి తేవటంతో నేడు మన రాష్ట్రం ‘సజల సుజల సస్యశ్యామల తెలంగాణ’గా మారింది. రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రతీ 5000 ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించటం, రైతు వేదికల నిర్మాణం, పంట కల్లాల నిర్మాణం, రైతుబంధు సమితిల ఏర్పాటు, పంటకాలంలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, విధివశాత్తూ అసువులు బాసిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా, ప్రాజెక్టులు నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించడం, నీటి తీరువా బకాయిల రద్దు చేయటం, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీటి సరఫరా చేయటం ద్వారా నేడు వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించగలిగాం. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో రూ. 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలోనూ రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేనేలేవంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ రంగానికి శతాబ్దాలుగా ఆదరువుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై, పూడిపోయి, గట్లు తెగిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. రాష్ట్రం ఏర్పడిన వెంటనే మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరించుకున్నాం. ఫలితంగా 15 లక్షలకు పైగా ఎకరాల సాగుభూమిని స్థిరీకరించుకున్నాం. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. ఈ చెరువులన్నింటికీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసిన ఫలితంగా నేడు నిండు వేసవిలో కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. చెరువులు అభివృద్ధి చెందటంతో చేపల పెంపకం జోరందుకుని, మత్స్యకారులు పెద్దఎత్తున లబ్ది పొందుతున్నారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకున్నం. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, చనాకా-కొరాట మొదలైన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వఘట్టం. కేవలం మూడేళ్ళలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతి పెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తోంది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్నసాగర్. దీని నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు. కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి మొక్కు తీర్చుకున్నాం. రాష్ట్రం ఏర్పడే నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. అదే 2021 నాటికి 85.89 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం సాగునీటి సౌకర్యం కల్పించింది. ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను ఒకే గొడుగు కిందకి తెచ్చి సాగునీటిశాఖను పునర్వ్యవస్థీకరించింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే ధ్యేయంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాం.
సమాజంలో అనాదిగా అణగారిన దళితజాతి అభ్యున్నతే ధ్యేయంగా దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నాం. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించాలని, దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆ లక్ష్య సాధన కోసం నేనే స్వయంగా దళితబంధు పథకానికి రూపకల్పన చేశాను. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇది రుణం కాదు. తిరిగి చెల్లించే పనిలేదు. పూర్తి గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన.. వచ్చిన పనిని లబ్దిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఏ విషయంలోనూ లబ్దిదారునిపై ఎటువంటి ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ కూడా ఏర్పాటు చేస్తున్నది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబం ఆ ఆపద నుంచి తేరుకొని తిరిగి ఆర్థికంగా నిలదొకుకోవడానికి ఈ నిధి దోహద పడుతుంది. దళితబంధు లబ్ధిదారులు వివిధ వ్యాపార రంగాలలో ఎదిగేందుకు వీలుగా, ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకొనే లాభదాయక వ్యాపారాలైన మెడికల్ షాపులూ, ఫెర్టిలైజర్ షాపులూ, వైన్ షాపులూ, హాస్టళ్ళూ, హాస్పిటళ్ళకు సరఫరా చేసే, వివిధ రకాల కాంట్రాక్టులలో ప్రభుత్వం దళితులకు పదిశాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది.
రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఏడాది దళితబంధు అమలు కోసం బడ్జెట్లో రూ. 17,700 కోట్ల కేటాయించింది. ప్రభుత్వం ఒక ఉత్తమ లక్ష్యంతో, మహోన్నత ఆశయంతో, ఉద్యమస్ఫూర్తితో అందిస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలి.
రాష్ట్రంలో గూడులేని నిరుపేదలకు సొంత ఇంటి కలను తీర్చడమే కాకుండా గౌరవ ప్రదమైన నివాసాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. దేశంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల 91 వేల ఇండ్లు మంజూరు చేసింది. ఇందుకోసం రూ. 19,126 కోట్ల కేటాయించింది. అలాగే సొంత స్థలం కలిగిన వారికి డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి దశలవారీగా రూ. 3 లక్షలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారునికి అందే వరకూ ఈ పథకం అమలవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ వికాసమే ధ్యేయంగా మొదటిదశలో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్థినీవిద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్ల వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్రంలోని 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్ల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించింది. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నది. అలాగే కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్నీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషిచేస్తోంది. ప్రజావైద్యం, ఆరోగ్య రంగాలలో రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిస్తోంది. రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ హాస్పిటళ్లల్లో 57 వైద్యపరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కోసం 42 ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేసింది. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రంలోని అన్ని బెడ్స్ ను ఆక్సీజన్ బెడ్స్గా మార్చింది. రాష్ట్రంలో 56 వేల ఆక్సీజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆసుపత్రులలో హార్ట్ సర్జరీల కోసం క్యాథ్ ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు సైతం చేస్తున్నారు. ఉత్తమ వైద్యసేవలతోపాటు రోగులకు మంచి పౌష్టికాహారం అందించడానికీ, పారిశుధ్య ప్రమాణాలు పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు రూ. 5కే భోజనం అందజేస్తున్నది.
గర్భిణులను హాస్పిటల్కు తీసుకురావడం, ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసం ప్రభుత్వం 300 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. మాతా, శిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలనిచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి రూ. 13వేలు, మగపిల్లవానికి జన్మనిచ్చిన తల్లికి రూ. 12వేలు ఈ పథకం ద్వారా అందిస్తున్నాం. అదనంగా మాతా, శిశు సంరక్షణకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్టును అందిస్తున్నది కేసీఆర్ కిట్ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 13 లక్షల 30వేల మంది మహిళలకు లబ్ది చేకూరింది. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుంచి 56 శాతానికి పెరిగింది. మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ బస్తీలలో నివసించే పేదల వైద్య సేవల కోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలను కొత్తగా ప్రారంభించబోతున్నది. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలలో ప్రాథమిక వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటుచేస్తున్నది.
హైదరాబాద్ నగరవాసులతోపాటు సరిహద్దు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నాలుగుచెరగులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా రూ. 2,679 కోట్ల వ్యయంతో అల్వాల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, గచ్చిబౌలీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళను నిర్మిస్తున్నది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటవుతాయి. 16 స్పెషాలిటీలు, 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పీజీ కోర్సులు, నర్సింగ్, పారమెడికల్ కోర్సుల్లో విద్యనందిస్తారు. నిమ్స్ హాస్పిటల్లో మరో రెండు వేల పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిమ్స్లో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి.
వరంగల్లో హెల్త్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో 2వేల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యలో మానవీయ కోణమే దర్శనమిస్తుంది. వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చినవారు ఎవరైనా దుర6దృష్టవశాత్తూ మరణిస్తే, మృతదేహాన్ని ప్రభుత్వ అంబులెన్సులలో ఇంటివద్ద వదిలిపెట్టేందుకు ప్రభుత్వం పరమపద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ప్రశంసించింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావడం, ప్రభుత్వ పనితీరుకు ప్రబల నిదర్శనం. రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం మూడు మాత్రమే ఉన్న వైద్య కళాశాలలను ఇకపై జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే రెండేళ్లల్లో ఈ లక్ష్యం సాకారం అవుతుంది.
రాష్ట్ర ప్రజల ఆరోగ్య, డయాగ్నోస్టిక్ కేంద్రాల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్ ఫోన్లలో చూసుకొనే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్ను రూపొందించింది. ప్రభుత్వ వైద్యశాలలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో ఎక్కడైనా ఒక చోట పరీక్షలు చేయిస్తే పరీక్షల రిపోర్టుల వివరాలు ఈ యాప్లో పొందు పరుస్తారు. తద్వారా రాష్ట్రంలో ఏ ఆస్పత్రికి వెళ్ళినా ఈ రిపోర్టుల ఆధారంగా డాక్టర్లు వైద్యసేవలు అందిస్తారు.
తెలంగాణ పోరాట నినాదమే నీళ్ళు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిధులు మనకే దకుతున్నాయి. రాష్ట్రం అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. గత ఎనిమిదేళ్ళలో 1.33 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీచేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగుల సేవలను మానవతా దృష్టితో క్రమబద్ధీకరించి, ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్తవారితో భర్తీ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరపడం ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ నియామకాల ప్రక్రియలో ఉద్యోగార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం 10 సంవత్సరాల వయోపరిమితిపై సడలింపునిచ్చింది. ఇప్పటికే వివిధ శాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ కూడా ప్రారంభమైంది. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షలలో పోటీపడేందుకు వీలుగా మధ్యమధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తున్నది. ఇందుకోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించింది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం. ఈ సవరణ వల్ల ఇక నుంచి అటెండర్ నుంచి, ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలవుతుంది. ఈ విధంగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఒకేసారి ఇంతపెద్ద మొత్తంలో ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం, ఉద్యోగార్థులైన యువతీయువకులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమం అమలు చేస్తోంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడంతోపాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నది.
సమైక్యపాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణనిచ్చి ఆదుకుంటున్నది. ఇందులో భాగంగా మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నది. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత రిజర్వాయర్లు నిండి చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేపల దిగుమతి కూడా తగ్గింది. గంగపుత్ర, ముదిరాజ్ కులాల వారికి ఉచితంగా చేపలు పట్టుకొనే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో 8 ఏండ్లలో రూ. 25.782 కోట్ల మత్స్య సంపద సృష్టించబడింది. రాష్ట్రంలో గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. నేడు రాష్ట్రంలో గొర్రెల మందలు పెద్ద సంఖ్యలో పెరిగి, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ స్వావలంబన సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గొల్ల కురుమలు మన రాష్ట్రాన్ని గొర్రెల పెంపకంలో నంబర్-1గా నిలిపారు. గౌడ సోదరుల సంక్షేమం కోసం తాటి చెట్లపై పాత పన్ను బకాయిలు మాఫీ చేయడమే కాకుండా, శాశ్వతంగా చెట్ల పన్ను రద్దు చేసింది. మరణించిన లేదా అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకు 393 మంది గౌడ సోదరులకు లైసెన్సులు లభించాయి. తాటిచెట్ల నుంచి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ డ్రింక్ గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలుచేస్తోంది. దోబీఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ పనిని అప్పగించటంతోపాటూ నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. నేతన్నలకు కూడా రైతన్నల మాదిరిగానే రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ వృత్తులకు ప్రత్యేక ప్రేరణనిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆయా వర్గాలవారి ఆదాయం గణనీయంగా పెరగడం సంతోషాన్ని ఇస్తున్నది.
తెలంగాణ ప్రాంతం సర్వ మతాల, సంసృతుల సంగమ స్థానం. ప్రభుత్వం సకల మతాలను సమభావంతో ఆదరిస్తున్నది. తెలంగాణ గంగా జమునా తెహజీబ్ను కొనసాగిస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే. ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటుచేసింది. మైనారిటీ బాలికల కోసం 50 శాతం గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనివల్ల మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ గతంలో 18 శాతంగా ఉంటే, ఇప్పుడది 42 శాతానికి పెరిగింది. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. సకల జనులలో సంతోన్ని నింపుతున్నది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పరిపాలన అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం వివిధ సంసరణలు చేపట్టింది. ఈ సంస్కరణల ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతున్నాయి. భూ రికార్డులు ప్రక్షాళన చేసి, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించింది. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ రూపొందించింది. దీంతో నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ధరణి పోర్టల్ భూ పరిపాలనలో నవశకానికి నాంది పలికింది. రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు కొత్త డివిజన్లు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. మా గూడెంలో మా పాలన – మా తండాలో మా పాలన అనే ఎస్టీ సామాజిక వర్గాల చిరకాల వాంఛకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,146 మంది గిరిజనులు కొత్తగా సర్పంచులయ్యారు. 30 జిల్లాల్లో అన్ని హంగులతో అధునాతన వసతులతో సమీకృత కలెక్టర్ కార్యాలయాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో శాసనసభ్యుల కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మించాం. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తోంది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభించే విధంగా అత్యంత వేగంగా పనులు చేస్తున్నారు. సచివాలయ భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.
పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత రమ్యంగా, వైభవంగా తీర్చిదిద్దుకున్నాం. వెయ్యి ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఇదే విధంగా తీర్చిదిద్దుకుందాం. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న జలాశయాలన్నింటినీ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతూ, పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం సర్క్యూట్ టూరిజం అభివృద్ధి కోసం ఇటీవల బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలు కేటాయించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా, రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్ళలో రూ.2,32,111 కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. 16,48,956 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో 1500 కు పైగా పెద్ద, చిన్న పరిశ్రమలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐబీఎం, కాగ్నిజెంట్, అమెజాన్, ఒరాకిల్ వంటి అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ. 1, 83,569 కోట్లు కావడం గమనార్హం. కేంద్రం రూపొందించిన సుపరిపాలన సూచిలో మన రాష్ట్ర పరిశ్రమలు-వాణిజ్య రంగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఎనిమిదేళ్ళలో ఐటీ రంగంలో నూతనంగా 7, 78,121 ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక, ఐటీ రంగాలలో కలిపి 24 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్మెంట్ అందించింది. కరోనా కష్టాలు వెంటాడుతున్నా కొత్త పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించి అమలుచేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న యావత్ ప్రభుత్వ సిబ్బందికి ఈ 30 శాతం వేతనం పెంపును ప్రభుత్వం వర్తింపచేసింది. నేడు తెలంగాణ ఉద్యోగులు దేశంలో అత్యధిక స్థాయి వేతనం పొందుతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను.
ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో వివిధ రంగాలలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగుచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి వస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామీణ, పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగింది. ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిర్వహణకు ప్రతి నెల రూ. 256.66 కోట్ల నిధులు విడుదల చేస్తున్నది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను అందించి, చెత్త, ఇతర వ్యర్థాల నిర్వహణ కోసం డంపు యార్డు, మృతులకు సగౌరవంగా అంత్యక్రియల కోసం ఆధునిక వసతులతో వైకుంఠ ధామాలను సైతం ఏర్పాటు చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. దారికి ఇరువైపులా పచ్చని చెట్లు, నర్సరీలు, ప్రకృతి వనాలతో పల్లెలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పచ్చదనం, పారిశుధ్యం వెల్లివిరుస్తున్న తెలంగాణ గ్రామాలు, గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు, ఆదరణ లభిస్తున్నది. రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. మరో దఫా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు శుక్రవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్నాయి. భవిష్యత్ తరాలు శరీర దారుఢ్యంతో, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచే ఎంపిక చేసిన గ్రామాలలో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సాధించిన ప్రగతిపైన ఇటీవల కొన్ని జాతీయ మీడియా సంస్థలు కార్యక్రమాలు ప్రసారం చేశాయి. అది చూసి ఇతర రాష్ట్రాలవారు ఆశ్చర్యంతో, ఇంత తక్కువ కాలంలో ఇంతటి అభివృద్ధి ఎలా సాధ్యమైందని ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. మనం అనతికాలంలోనే అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించగలిగామంటే, అందుకు సహకరించిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది కాలంలో అత్యంత అభివృద్ధిని సాధించి, తెలంగాణలోని ప్రతి పౌరుని హృదయంలో గొప్ప స్థానాన్ని ప్రభుత్వం సంపాదించుకుంది. అనతి కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడింది. రాష్ట్రంలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. వృద్ధాప్య పింఛను మరింత మంది నిస్సహాయులకు అందించేందుకు అర్హత వయస్సును 57 ఏళ్ళకు తగ్గించుకున్నం. పింఛను మొత్తాన్ని కూడా భారీగా పెంచి అమలుచేస్తున్నాం. పేదింటి ఆడబిడ్డను తల్లిదండ్రులు గుండెలపై కుంపటిగా భావించే పరిస్థితి ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఇప్పుడు రూ.1,00,116 అందిస్తున్నది. ఈ పథకం ద్వారా 11,44,000 మంది ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సహాయం అందింది. బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఇవేవీ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు కావు. పేదల కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మానవతా హృదయంతో అమలులోకి తెచ్చిన పథకాలివి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు.. ఎనిమిదేళ్ళ చిరు ప్రాయంలో రాష్ట్రం సాధించిన విజయాలలో ఇప్పటి వరకూ నేను పేరొన్నవి కొన్ని మాత్రమే.
భారత దేశంలో పాటు స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం,మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోరన్నారు. సమస్త తెలంగాణ ప్రజానీకానికి అభివృద్ధి ఫలాలు పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలని ఆకాంక్షించారు. ఉజ్వల భారత్ నిర్మాణం కోసం జరిగే పోరులో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై ఏవిధంగా వివక్ష చూపిందో సాక్ష్యాలతో సహా వెల్లడించారు. అలాగే దేశంలో అభివృద్ధి లేదని, స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా దారిద్య్రంలో ఉన్నామని దేశానికి తెలంగాణ దిశ దశ కావాలని ఆకాంక్షించారు.
“దేశానికి ఈనాడు ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్య్ర బాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది ? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యం. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదురొంటున్న సమస్యలకు పరిషారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి.” అని సీఎం కేసీఆర్ అన్నారు.
“మనతో పాటు స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నం. ఇప్పడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతున్నది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా పోయాయి. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇదే విధంగా పెట్రేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇదే విధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనకు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనక్కు తీసుకపోవడం ఖాయం. దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.” అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. భారత దేశంలో ప్రజలకు కావల్సింది కరెంటు, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి.
ఆజన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం నా విధి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం కూడా మనందరి బాధ్యత. ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టి రాజీపడే ధోరణే లేదు. రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్ళమా? మృత్యువు నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్ళమా? సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారత దేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలి. దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే శక్తియుక్తులను ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నా.
ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు సమైక్య పాలకులు తెలంగాణపై వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరం. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళ నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టింది. దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మనం కోల్పోయాం. దీంతో కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, నాటి నుంచి నేటి వరకూ మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తున్నది.
ఐదేళ్ళపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. మన హైకోర్టు మనకు ఏర్పాటైన తర్వాత అవసరమైన సిబ్బందిని, నిధులను, భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నాం. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనే కమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదురొన్నదో అందరికీ తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క నయా పైసా అదనంగా ఇవ్వలేదు. పైగా, న్యాయంగా రావల్సిన నిధులపై కూడా కోత విధించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు. కేంద్రప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ, ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో తగని జాప్యం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని స్పష్టంగా పేరొన్నది. కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తున్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రాత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొంది. కానీ, కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు ఏవీ ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదు. తెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. ఇది అమలుచేసి ఉంటే ఐటీ రంగం మరింతగా పురోగమించి ఉండేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి.
ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన మన వైద్య విద్యార్థులకు ఎదురైన దుస్థితి మనకు తెలుసు. వీరంతా మన దేశంలోనే వైద్య విద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ కూడా రాశాను. మన రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్యకు అయ్యే ఖర్చును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశాను. కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదం. ఈ విషయంలో కేంద్రం ఉదాసీనతను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తున్నది.
తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అసమర్థతతో చేతులెత్తేసింది. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నాతో సహా ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేసినం. అయినా ఫలితం లేకపోవడంతో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ఒకరోజు జరిపిన నిరసన దీక్షలో నేను స్వయంగా పొల్గొన్నాను. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ కూడా మనకు మద్దతుగా ఈ దీక్షలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై 24 గంటల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తే సానుకూలంగా జవాబు రాలేదు. స్పందన లేదు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడిండు. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి.
దేశంలో రైతులు భిక్షగాళ్ళు కాదు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి. లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాను. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. కేంద్రం మొండి చెయ్యి చూపినా మన రైతాంగాన్ని ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటం విద్యుక్త ధర్మంగా భావించి, రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించింది. ధాన్యం దిగుబడి, కొనుగోళ్ళలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించింది. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి నేను భరోసా ఇస్తున్నా.
ప్రపంచ దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల పర్యవసానంగా రాచరిక, నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయి. అత్యధిక దేశాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ, పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నాయి. పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం పరిణతి చెందేకొద్ది ఆయా దేశాలు అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారికతను పెంపొందించాయి. పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. కానీ మన దేశంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. విశాలతరం కావల్సిన సమాఖ్య స్ఫూర్తి కుచించుకుపోతున్నది. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించింది. ఇప్పటి వరకు కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాశాయి. అధికారాలను నిస్సిగ్గుగా హరించాయి.
భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్రం పరిధిలోని అధికారాలనూ, రాష్ట్రాల పరిధిలోని అధికారాలనూ స్పష్టంగా నిర్వచించింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలను నిర్దేశించింది. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతున్నది. రాష్ట్ర జాబితా తరుగుతున్నది. రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నది. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సరారియా, పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయి. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల నివేదికలను బుట్ట దాఖలు చేశాయి. ఇప్పటి వరకూ దేశాన్ని ఏలిన ఈ ప్రభుత్వాలు అనుసరించిన ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏరకంగానూ మంచి చేయక పోగా, దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయి.ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం “బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు” అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హకుల హననం పరాకాష్టకు చేరుకున్నది.
కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితం. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది.
రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారైంది. కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇక నుంచైనా మానుకోవాలి.
కేంద్రానికి తలొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలుచేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయింది. మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తోంది. ఈ 25 వేల కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బాయిలకాడ మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతుల మీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణమున్నంత కాలం రైతాంగానికి నష్టం చేసే విద్యుత్ సంసరణలను అంగీకరించేది లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం.