హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గిరిజన తండాలలో స్థానికులకే పాలనాధికారం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చి ఐదేండ్లు పూర్తయ్యింది. ‘మా తండాలో మా రాజ్యం. తండాలుగా గ్రామ పంచాయతీలుగా మార్చాలి’ అన్న డిమాండ్తో గిరిజనులు రెండున్నర దశాబ్దాల పాటు పోరాటం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వారి డిమాండ్ను ఏ నాయకుడూ పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. మాయ చేసి ఓట్లు వేయించుకోవడం.. ఆ తరువాత పట్టించుకోకపోవడం నాటి పాలకులకు రివాజుగా మారింది. గిరిజనుల దశాబ్దాల కలను వారి కోణంలో అర్థం చేసుకొని దానిని నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ది. ఉమ్మడి పాలకులు చెప్పిన సాకులన్నంటినీ అధిగమించి, చిన్న పంచాయతీలు ఆచరణ సాధ్యం కాదంటూ చేసిన వాదన సరికాదని, తండాలను పంచాయతీలుగా మార్చారు. 2018 ఆగస్టు 1న రాష్ట్రంలోని 1851 తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో సైతం లేనంత మంది గిరిజనులు గ్రామ సర్పంచులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికయ్యారు. వారు తమ ఆత్మవిశ్వాసాన్ని చాటుతూ తాము కూడా పరిపాలించుకోగలుగుతామంటూ ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు, గోండులు, ఆదివాసీలు అధికంగా నివసించే ప్రాంతంగా తెలంగాణ గుర్తింపు పొందింది. గిరిజనుల డిమాండ్ల పట్ల బీఆర్ఎస్ ఆది నుంచి సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తరువాత తండాలను పంచాయతీలుగా మారుస్తామని ప్రకటించారు. మా గూడెంలో/మాతండాలో మా పాలన అంటూ గిరిజనులు చేస్తున్న డిమాండ్ను పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. పంచాయతీల ద్వారా స్వయం పాలన, తండాల అభివృద్ధి ఏ విధంగా చేసుకోవచ్చో వివరించారు. గిరిజనులు బీఆర్ఎస్ను, కేసీఆర్ను విశ్వసించారు, పట్టం కట్టారు.
మాట నిలబెట్టుకొని…
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదటిసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. మైదాన ప్రాంతంలో 1,177 తండాలను, గిరిజన ప్రాంతంలోని 674 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. ఇవేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీల రిజర్వేషన్ ద్వారా 3,146 గ్రామాలకు సర్పంచ్లుగా గిరిజనులు, ఆదివాసీలు ఎన్నికయ్యారు. వేయి లోపు జనాభా ఉన్న తండాలకు జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తే తక్కువ మొత్తం వస్తుందని అందువల్ల కనీసం ఐదు లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆ గ్రామాలు ఆర్థికంగా పరిపుష్ఠిగా ఉండే విధంగా చేశారు.
ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు…
తండాలు గ్రామ పంచాయతీలుగా మారడం ద్వారా వాటిల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. ప్రతి తండాకు ఒక గ్రామ కార్యదర్శిని నియమించారు. ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది. బీటీ రోడ్లను మంజూరు చేశారు. దీనికోసం దాదాపుగా రూ.600 కోట్లను వెచ్చించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వచ్చింది, పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడింది. గతానికి ఇప్పటికి స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ప్రతి తండా రాత్రి వేళల్లో ఎల్ఈడీ లైట్లతో వెలుగు జీలుగులు విరజిమ్ముతునాన్నది. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నల్లా నీరు అందుతున్నది. ప్రత తండా పంచాయతీకి ఒక నర్సరీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటైంది.