హైదరాబాద్, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ): నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అంతే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. రెండో విడతగా ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకానికి ప్రభుత్వం ఏకంగా రూ.17,700 కోట్లను కేటాయించింది. నియోజకవర్గానికి 1100 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. తొలివిడతలో సుమారు రూ.4 వేల కోట్ల బడ్జెట్తో పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 38,323 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసింది. దళితుల సమున్నత ఉద్ధరణ, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం ఇప్పటికే లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నది.
వెలివాడ జీవితాల్లో వెలుగులు నింపుతూ నిర్విఘ్నంగా ముందుకుసాగుతున్నది. గత ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతికి అమలు చేసిన పథకాల మాదిరి కాకుండా, అందుకు భిన్నంగా షరతులు లేకుండా, బ్యాంకులతో ఎలాంటి సంబంధం లేకుండానే స్వయం ఉపాధి కోసం దళితులకు రూ.10లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి సర్కారు కొత్త బాటలు వేస్తున్నది. తొలుత హుజురాబాద్ నియోజకవర్గం, అటు తరువాత పాలేరు నియోజకవర్గంలో చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి, సూర్యాపేట నియోకవర్గంలోని చారగొండ, జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ మండలాలతోపాటు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అమలు చేస్తున్నారు.