KCR Press Meet – తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఓవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి యాసంగికి వరి పండించకండి అని రాతపూర్వకంగా రాసి ఇచ్చి.. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాత్రం వదిధాన్యాన్ని పండించండి.. అంటూ మాట్లాడటం దేనికి నిదర్శనం అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు.
పంజాబ్లో కేంద్ర ప్రభుత్వం వంద శాతం ధాన్యం సేకరిస్తోంది. మరి తెలంగాణలో ఎందుకు ధాన్యం సేకరించడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఎందుకు కొనరు.. కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్నడు. మంచిది కాదు కిషన్ రెడ్డి గారు.. జాగ్రత్తగా మాట్లాడండి. నేను కూడా పనిచేశా కేంద్ర మంత్రిగా. అంత పెద్ద పదవి వచ్చినప్పుడు బాధ్యతగా, హుందాగా వ్యవహరించాలి. మొన్న హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి కేసీఆరే బాధ్యడు అంటూ మాట్లాడుతున్నారు. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే. అప్పుడు ఆయన చేసిన దాని వల్లే మేం ధరలు పెంచినం.. అని మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. ఇదేనా మాట్లాడేది. ఉందా నీ దగ్గర లెక్క అసలు. చూపిస్తవా? వస్తవా? ప్రతి విషయాన్ని ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు.. అంటూ కేసీఆర్ మండిపడ్డారు.
భ్రమలు కల్పించి.. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్లు చేసిందేం లేదు. వీళ్లు రైతాంగాన్ని బాగు చేయలేదు.. గిరిజనులను బాగు చేయలేదు.. దళితులను బాగు చేయలేదు. రైతులను తొక్కేయండి.. రైతుల మీద కార్లు ఎక్కించడమేనా నీతి. ఒక సంవత్సరం నుంచి రైతులు ధర్నా చేస్తున్నరు. ఏనాడైనా పట్టించుకున్నారా? మొత్తం రైతుల జీవితాలను తీసుకెళ్లి కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారు. మోసం చేస్తున్నారు. కార్పొరేట్ వాడు ఎంత ధర చెబితే అంతే ధరకు రైతు అమ్ముకోవాలా. పార్లమెంట్లో కూడా రాష్ట్ర హక్కుల కోసం, ధాన్యం గురించి కూడా కొట్లాడుతాం. అవసరం అనుకుంటే అందరు ఎమ్మెల్యేలు కూడా వెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తరు. నేను కూడా వెళ్తా. అందరం వెళ్లి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతాం.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.