CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి.. వారిని ఓదార్చారు. పంటల వివరాలను సీఎం కేసీఆర్కు కలెక్టర్ వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం పటిష్ట పడి పనులన్నీ ముందుకు పోతున్న తరుణం ఇది. ఇలాంటి సమయంలో అకాల వడగళ్లవాన, ఈదురుగాలులు, తుఫాన్ల వల్ల అనేక జిల్లాల్లో పంట నష్టం జరిగింది. 2.28లక్షల ఎకరాలు దెబ్బతిన్నట్లుగా కలెక్టర్ల ద్వారా సమాచారం అందింది. పెద్ద ఎత్తున మొక్కజొన్న దెబ్బతిన్నది. 1.29లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8865 ఎకరాల్లో మామిడితోటలు, వాటర్ మెలన్, మస్క్ మెలన్, వంకాయలు తదితర ఇతర పంటలన్నీ కలిపి 17238 ఎకరాల్లో దెబ్బతిన్నట్లుగా సమాచారం ఉంది.
పరిశీలనలో పంట మొత్తం దెబ్బతిన్నట్లు తేలింది. గతంలో చొప్పదండి, నర్సంపేట ఇతర ప్రాంతాల్లో అనేక ఇబ్బందులతో రైతాంగమంత కకావికలమై చెట్టుకొకరు గుట్టకొకరు చెదిరిపోయిన పరిస్థితి ఉండేది. సమైక్యపాలనలో భయంకరమైన పరిస్థితులుండేవి. చొప్పదండి కరువుప్రాంతం కింద ఎడారిలా ఉండేది. చాలా నైపుణ్యంతో అద్భుతమైన కాళేశ్వరం నిర్మించుకున్నాం. ఇప్పుడు కూడా పంపులు నడుస్తున్నయ్. బ్రహ్మాండంగా వాగుపారినట్లు కాలువ పారుతుంది. కొందరు రాజకీయ వెదవలు, అజ్ఞానులు మూర్ఖంగా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడినా వాటిని పట్టించుకోకుండా ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే ఫలితాలు వస్తున్నాయి’ అన్నారు.
‘భారతదేశం మొత్తం కలిపితే ఎంత ఉంటదో.. దానికంటే వరి ఎక్కువ తెలంగాణలో ఉంది. రాష్ట్రంలో 56లక్షల ఎకరాల్లో వరి చేను ఉన్నది. దాదాపు 20-22లక్షల ఎకరాల్లో మిర్చీ, కూరగాయలు తదితర పంటలు ఉన్నాయి. పండ్లు, పూలతోటలు కలుపుకొని 84లక్షల ఎకరాలు రెండోపంట సాగులో ఉన్నది. భారతదేశంలో ఈ స్థాయిలో వ్యవసాయం లేదు. చెట్టుకొకరు గుట్టకొకరైన వారిని, వలసపోయిన వారిని తిరిగి రప్పించి బ్రహ్మాండంగా వ్యవసాయం నిలబెట్టుకొని పని చేసుకుంటున్నాం. ఎవరెన్ని విమర్శలు చేసినా రైతులను, రైతులోకాన్ని ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఫ్రీ కరెంటు, ప్రాజెక్టుల నుంచి ఉచితంగా నీరు, పాత నీటి తీరువా బకాయిలు రద్దు చేశాం. బ్రహ్మాండంగా పచ్చగా పొలాలు కనిపిస్తున్నయ్. గతంలో ఈ సీన్ కనిపించేవి కావు. కాళేశ్వరం నిర్మాణం సమయంలో గాయత్రి పంప్హౌస్కు వచ్చిన సమయంలో పచ్చని పొలాలు కనిపించలేదు. ఈ సారి దురదృష్టంతో పంటలు దెబ్బతిన్నా.. గ్రౌండ్ వాటర్ బాగుంది. ఫ్లడ్ఫ్లో కెనాల్ రిజర్వాయల్గా మారింది కాబటి అద్భుతంగా పంటలు పండించుకుంటున్నామని రైతులు చెబుతున్నరు. నాకు నాలుగైదేళ్లుగా లాభాలు వచ్చాయి.. ఈ సారి నష్టం వచ్చినా సరే తట్టుకుంటామని ఓ రైతు చెబితే నాకు కూడా గుండెధైర్యం అనిపించింది’ అని తెలిపారు.
‘ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం.. మొక్కజొన్న నష్టపోతే రూ.3333, వరిచేనుకు రూ.5400, మామిడికి రూ.7200, మిగతా పంటలకు చాలా తక్కువ ఇస్తరు. కానీ, మళ్లీ వ్యవసాయం వెనక్కి పోవద్దు. రైతులోకం ఆత్మస్థయిర్యం దెబ్బతినొద్దని నాలుగు రూపాలు ఖర్చయినా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లిస్తాం. పైనున్న కేంద్రాన్ని కూడా అడగదలచుకోలేదు. కేంద్రానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే రకంగా ఉన్నది. ఎదుకంటే చెప్పి చెప్పి దొంగలు పడ్డంక ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు బృందాలు రావడం.. డ్రామాలు చేయడం తప్పా ఇచ్చేది ఏమీ లేదు. మొత్తం రాష్ట్ర నిధుల నుంచే పరిహారం అందిస్తున్నాం.
కేంద్రంలో చదువూశాత్రం లేనివారంతా రాజ్యమేలుతున్నరు, పలికిమాలినోళ్లు. చెప్పినా అర్థం కాదు. సమస్యను అర్థం చేసుకునే సంస్కారం లేదు. ఇప్పటికీ రెండుసార్లు మూడుసార్లు పంపినా ఇవ్వలేదు. హైదరాబాద్కు వరదలు వచ్చినా ఆదుకోలేదు. వారిని అడుక్కునే పరిస్థితి లేకుండా.. భగవంతుని దయతో మన ఎకానమీ బాగా పెరిగింది కాబట్టి ఇబ్బందేం లేదు. రైతాంగాన్ని ఆదుకుంటాం. రైతులకు మీడియా ద్వారా తెలిపేది ఒకటే. ఇప్పటికే ఉపద్రవం అయిపోలేదు.. ఇంకా రావొచ్చు. ఇంకా రాబోయే రెండుమూడు రోజుల్లో రాళ్లుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులోకాన్ని కోరేది ఒకటే.. భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వసతులు తెలంగాణ రైతాంగానికి చేకూర్చి.. వారిని కడుపులో పెట్టుకొని ఉన్నత స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోగలిగాం’ అన్నారు.