యాదాద్రి భువనగిరి : దేశంలో ఉన్న బీజేపీ మొగోళ్లు దమ్ముంటే నేను అడిగే దానికి సమాధానం చెప్పాలి.. అని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. జిల్లాలోని రాయగిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. మోదీ తెలివి తక్కువతనం వల్ల దేశం వెనక్కిపోతోందన్నారు.
కేంద్ర ప్రభుత్వ లెక్కలే మీ డొల్లతనాన్ని బయట పెడుతున్నాయి. పంటలు పండిస్తే కొనే చేతకాదు. బీజేపీ జెండా ఎం చేస్తున్నది.. దేశాన్ని ఆకలి రాజ్యం చేస్తారా.. నీళ్లు, కరంట్ ఇచ్చే సోయి బీజేపీకి లేదు. కరోనా టైమ్లో గంగానదిలో శవాలు తేలాయి.. ఇది మోదీకి సిగ్గు చేటు. మోదీ తెలివి తక్కువతనం వల్లనే లాక్ డౌన్ పెట్టి ప్రజలను అరిగోస పెట్టించారు. తెలంగాణ సమాజం బీజేపీ దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారండి.. దయచేసి మీరు ఆలోచించాలి..నాకే కళ్లలో నీళ్లు తిరిగాయి. తల దించుకున్నంత పని అయింది. ఒక ఎంపీని పట్టుకొని మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా.. ఈ మాట అనొచ్చునా.. ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. మన హిందూ ధర్మం ఇదేనా.. మన దేశం మర్యాద ఇదేనా.. అని సీఎం ప్రశ్నించారు.
పిచ్చి ముదిరి పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తున్నరు. వ్యవసాయ చట్టాలు తెచ్చిన్రు. ఒక యాడాది పాటు రైతులను ఏడిపించింన్రు. ఢిల్లీ దగ్గర రైతులను అవమానపరిచారు. ఇన్సల్ట్ చేసి మాట్లాడారు. వాళ్లు ఖలిస్తాన్ ఉగ్రవాదులని అవమాన పరిచారు. లాఠీచార్జీలు చేశారు. గుర్రాలతో తొక్కించారు.. చివరకు ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి రైతుల ధర్నా మీదికి తీసుకెళ్లి తొక్కిచ్చిన విషయం టీవీల్లు, పేపర్లో చూశారు. మళ్లీ ఐదు రాష్ట్రాల ఎన్నికల వస్తే ప్రజలకు భయపడి ఆ బిల్లులు వాపస్ తీసుకొని.. ప్రధాని స్వయంగా క్షమాపణ కోరుతున్నా అని మాట్లాడిండు.. సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
సిలికాన్ వ్యాలీ బెంగళూరులో మతపిచ్చి లేపి కశ్మీర్ వ్యాలీలా మార్చుతున్నారు. ఇది అవసరమా దేశానికి. ఈ దేశ యువత.. రేపటిది మీ భవిత.. అని సీఎం కేసీఆర్ జిల్లాలోని రాయగిరి సభలో స్పష్టం చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా.. ఐటీ రంగంలో భారతదేశానికే సిలికాన్ వ్యాలీ బెంగళూరు సిటీ.. కర్ణాటక రాష్ట్రం. దాని తర్వాత రెండో స్థానంలో ఉన్నది మన హైదరాబాద్ సిటీ.. తెలంగాణ రాష్ట్రం. కర్ణాటకలో ఏం జరుగుతున్నది మీకు తెలుసు కదా. ఆడపిల్లల మీద.. మన బిడ్డల మీద.. పసికూనల మీద రాక్షసుల్లా ప్రవర్తించవచ్చునా.. అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.