నరేంద్ర మోదీకి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే అని.. వాళ్లకు చెప్పినా లాభం లేదు. దున్నపోతు మీద వాన పడినట్టే ఉంది.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికే పట్టిన దరిద్రం అంటే.. రాష్ట్రానికి ఇంకెక్కువ పట్టిన దరిద్రం బీజేపీ. కంట్రీ ఎకానమీ సైజు పెంచే తెలివి లేదు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచరా? 8 ఏళ్ల నుంచి రూ.2.5 లక్షలే ఉంది. నేషనల్ ఎజెండాలో మేము చెబుతం. నీతి ఆయోగ్లో ఇవన్నీ చెప్పాం. ఫౌల్ట్రీ ఫామ్ మీద డెయిరీ ఫామ్ మీద ట్యాక్స్ తీసేయండి అని చెప్పాం. పాడి పంట అంటాం తెలుగులో.. హిందీతో కేతీ బాడీ అంటారు. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి. దాన్ని తీసేయండి అన్నాం. కానీ.. వినలేదు.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
నూటికి నూరు శాతం బీజేపీని నిలదీస్తం. నేను కొద్ది రోజుల్లో ఢిల్లీకి వెళ్తా. ఈ దేశంలో అద్భుతమైన పరివర్తన రావడానికి.. ఈ దేశ రాజకీయాల్లో దేశ ప్రజల ఆలోచన విధానంలో.. దేశ ఆర్థిక పురోగతిలో అద్భుతమైన ప్రపంచ ఎకానమీగా తీర్చిదిద్దడంలో.. అవసరమైన గుణాత్మక మార్పు కోసం నా ప్రాణాన్ని ఒడ్డి అయినా సరే పోరాటం చేస్తాను. దాని కోసం ఏదైనా చేస్తా. ప్రతి ఒక్క పార్టీతో మాట్లాడుతా. కలిసివచ్చే వాళ్లతో కలిసి వెళ్తా. యూఎస్ కన్నా పెద్ద ఎకానమీగా ఇండియాకు ఎదిగే సత్తా ఉంది. ఇక్కడ ఉన్న రిసోర్సులు అటువంటివి.
ఇక్కడ థర్డ్ ఫ్రంట్ లేదు.. దిక్కుమాలిన ఫ్రంట్ ఏదీ లేదు. దేశంలో అద్భుతమైన పరివర్తన కోసం.. దేశ ఆర్థిక పురోగమనాన్ని వంద రెట్లు.. వెయ్యి రెట్లు పెంచడం కోసం ఏది అవసరమో అది చేస్తాం.
తెలంగాణలో నేడు భూముల విలువ ఎక్కడికో పోయింది. తెలంగాణలో ఒకప్పుడు లక్ష రెండు లక్షలు ఉంటే.. ఇప్పుడు రోడ్డు పక్కన 50 లక్షలు ఉంది. ఇది ఎలా సాధ్యం అయింది. నాలుగు ఎకరాలు ఉన్న రైతు ఇప్పుడు కోటీశ్వరుడు. ఢిల్లీ, ముంబైలో ఉన్నవాళ్లు.. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి విల్లాలు కొనుక్కుంటున్నారు. తెలంగాణ ఒక దరికి రావడం కోసం.. నేను ఓపిక పట్టాను. ఘర్షణ పడలేదు. పంచాయతీ పెట్టుకోలేదు. ఓర్పు, సహనంతో పనిచేశా. ఇండియాలోనే ఎక్కువ జీతాలు పే చేస్తున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు. పేదింటి ఆడబిడ్డలకు 10 లక్షల పెళ్లిళ్లు చేసిన రాష్ట్రం ఏదీ లేదు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా 10 లక్షల పెళ్లిళ్లు చేశాం.
తెలంగాణలో బీజేపీ అనే పార్టీనే లేదు. 2018లో దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ అది. తప్పకుండా బీజేపీ బలం తగ్గుతుంది. అహంకారం తగ్గుతుంది. ఈసారి టీఆర్ఎస్ గెలువబోయే సంఖ్య 95 నుంచి 105 వరకు ఉంటుంది.. రాసిపెట్టుకోండి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.