ఖమ్మం, వరంగల్, కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధులు)/ మహబూబాబాద్ (నమస్తే తెలంగాణ), మార్చి 23: విపత్తుల వేళ తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. అకాలవర్షంతో జరిగిన పంటనష్టంపై కేంద్రాన్ని పరిహారం అడగదల్చుకోలేదని తేల్చిచెప్పారు. ‘గతంలో విపత్తులు వాటిల్లినప్పుడు పలుమా ర్లు ప్రతిపాదనలు పంపినా.. కేంద్రం ఏకాణా ఇవ్వలేదు. కేంద్రంలో చదువు లేని సన్నాసులు రాజ్యమేలుతున్నరు. రైతుల బాధలు వాళ్లకు చెప్పినా అర్థం కావు. సమస్యను అర్థం చేసుకునే సంస్కారం కూడా వాళ్లకు లేదు.
కేంద్రానికి చెప్పినా.. దున్నపోతుకు చెప్పినా ఒక్కటే రకంగా ఉంటుంది. అందుకే రైతులకు జరిగిన నష్ట పరిహారంపై కేంద్రాన్ని అడగదల్చుకోలేదు’ అని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అకాలవర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పంటలను గురువారం పరిశీలించిన ఆయన, ఖమ్మం, కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. దేశంలో అత్యధికంగా ఎకరానికి రూ.10 వేల పంట సాయం అందిస్తామని ప్రకటించారు. దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టు పంటనష్టం నివేదికలు అందజేసిన తర్వాత ఎప్పటికో కేంద్ర బృందా లు వస్తాయని విమర్శించారు.
అప్పటికీ రాష్ట్ర పర్యటన పేరుతో తిరిగి, డ్రామాలు చేయడం తప్ప వారు ఏకాణా ఇచ్చేది ఉండదని మండిపడ్డారు. ‘పంటనష్టంపై గతంలో కేంద్రం ఎకరానికి రూ.3,300 ఇచ్చిన సందర్భాలున్నా.. రైతుకు జరిగిన నష్టానికి అవి ఎటూ సరిపోవు. అందుకే మన రైతులను మనమే బతికించుకోవాలనే భావనతో వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు తక్షణమే మంజూ రు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రం పై ఆధారపడేది లేదు. పరిహారం మొత్తం రాష్ట్ర నిధుల నుంచే చెల్లిస్తాం’అని స్పష్టంచేశారు.
హైదరాబాద్లో వరదలు వస్తే పైసా ఇవ్వలేదు
హైదరాబాద్లో వరదలు వచ్చి నష్టంవాటిల్లితే.. కేంద్ర ప్రభుత్వం ఏకాణా కూడా పరిహారం ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పటికీ రెండు మూడు సార్లు నష్ట పరిహారం కోసం నివేదికలు పంపించినా స్పందించలేదని, పంటనష్ట పరిహారం కూడా కేంద్రాన్ని అడగదల్చుకోలేదని చెప్పారు. ‘భగవంతుడి దయవల్ల రాష్ట్ర ఎకానమీ పెరిగింది. రైతులను ఆదుకుంటే వచ్చే ఇబ్బంది ఏమీలేదు. అందుకే పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి రూ.10వేలు సాయంగా అందిస్తున్నాం. రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద మొత్తంలో పరిహారం ప్రకటించాం’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
కేంద్రానికి పట్టదు.. పరిహారం గిట్టదు..
అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట లు చిన్నాభిన్నమై పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు రాష్ట్రం ప్రభుత్వం అండగా నిలిస్తే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో అకాలవర్షాలు, వరదలతో రాష్ట్రంలో తీవ్ర పంటనష్టం వాటిల్లింది. అయితే ప్రతిసారీ తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపడమే తప్ప.. కేంద్రం ఒక్కసారైనా నిధులు మంజూరు చేయలేదు. 2021లో భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్లో బీభత్సం సృష్టించగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఆగమయ్యాయి. దీనిపై సుమారు రూ. 7వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి సమగ్ర నివేదికను పంపింది. దొంగలు పడ్డ ఆరునెలలకు.. అన్నట్టుగా పంట కోతలు పూర్తయ్యాక కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. రాష్ట్రం వద్ద ఉన్న నిధుల్లో నుంచి రైతులకు పరిహారం ఇవ్వాలని తీరిగ్గా సమాధానమిచ్చింది. రాష్ట్ర రైతులకు నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది.