షాద్నగర్: యాసంగి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధును తీసుకుంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండని తిరుగుతున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు సిగ్గుమానం ఏమైనా ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం షాద్నగర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు.
‘కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో గెలుపు కోసం చెయ్యని లాలూచీ పనులు లేవు. ఎన్ని అడ్డమైన కుట్రలు చేయాల్నో అన్నీ చేస్తున్నరు. రైతుబంధు దుబారా అంటరు. కరెంటు వృథా అంటరు. ధరణిని తీసేస్తమంటరు. ఇసుంటి లంగ మాటలు చాలా మాట్లాడుతున్నరు. లంగ పనులు చాలా చేస్తున్నరు. ఈ యాసంగికి రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతుబంధు ఎయ్యకుంట కాంగ్రెసోళ్లు ఆపిండ్రు. రైతుబంధు ఆపాల్నని ఎన్నికల కమిషన్కు దరఖాస్తు ఇచ్చి అడ్డంపడ్డరు. దాంతోటి నేను అడిగితే ఒకరోజులో రైతుబంధు ఎయ్యిండ్రని ఈసీ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇయ్యంగనే వద్దువద్దని మళ్ల దరఖాస్తు ఇచ్చిండ్రు. దాంతోటి ఈసీ మళ్ల ఆపింది’ అని సీఎం చెప్పారు.
‘కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలల్ల కూడా రైతుబంధు తీసుకునేటోళ్లు చాలా మంది ఉన్నరు. వాళ్లకు ఏమన్న సిగ్గు, మానం ఉందా..? అని నేను అడుగుతున్న. మీ ఖాతాల్లో పడాల్సిన రైతుబంధును పడకుండా అడ్డుకున్న కాంగ్రెస్ మీరెట్ల మద్దతిస్తరంటున్నా. ఇసుంటి కాంగ్రెస్కు మద్దితిస్తే మీ కొంప గూడా కొల్లారం కాదా..? మీకు రావాల్సిన రైతుబంధు ఆగిపోదా..? కాబట్టి ఇతర ప్రజలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు గూడా ఈ విషయంపై బాగా ఆలోచించాలె. కాంగ్రెస్ కుట్రలను గుర్తెరిగి ఎన్నికల్లో ఓడగొట్టాలె. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం మళ్ల ఎనకబడుతది. మళ్ల ఎనకటి దరిద్రపు రోజులే వస్తయ్’ అన్నారు.