వరంగల్ : కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ తిట్టిపోతారు.. మళ్లీ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని రేపే అవార్డులు ఇస్తారని కేసీఆర్ అన్నారు. వరంగల్లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
ఇక్కడున్న విద్యార్థులకు అన్ని విషయాలు తెలుసు.. ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారు. తెలంగాణ ప్రజల అండతో ఉద్యమం సాగించి, రాష్ట్రాన్ని సాధించామన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్ను, మంత్రులను తిట్టిపోతారు. ఇవాళ తిట్టిపోతారు.. రేపు అవార్డులు ఇస్తారని కేసీఆర్ తెలిపారు. ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాము. తెలంగాణ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం ఉంది. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
ఆరోగ్యం రంగంలో కూడా అద్భుతాలు సాధించాం. మరిన్ని విజయాలు సాధించాలి. 2014 కంటే ముందు ఐదు కాలేజీలు మాత్రమే ఉండే. కొత్తగా 12 కాలేజీలు మంజూరు చేశాం. మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్రం వివక్ష చూపించింది. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. త్వరలోనే అన్ని కాలేజీలు ప్రారంభమవుతాయి. హరీశ్రావు సారథ్యంలో ఇది సాధ్యమైంది. 2014కు ముందు 2800 మెడికల్ సీట్లు ఉండేవి. ఇప్పుడు 6500 మెడికల్ సీట్లు ఉన్నాయి. అన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే దాదాపు 10 వేలు కూడా దాటే అవకాశం ఉంది. మన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్కు వెళ్లే అవకాశం కూడా రాదు. పీజీ సీట్లు 1150 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 2500కు చేరింది. ఆరోగ్య రంగంలో చాలా బాగా పురోగమిస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణ దేశానికే ఒక మార్గదర్శకంగా మారిందన్నారు కేసీఆర్.