హైదరాబాద్ : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి రైతాంగం నడ్డి విరించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఇవాళ సాయంత్రం లేఖరాయనున్నారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వమని తేలిపోయిందన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎరువుల ధరలు పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచిందని మండిపడ్డారు.
దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదని, వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని కోరితే.. చేయకుండా నాన్చుతూ వస్తోందన్నారు. విపరీతంగా ధరలు పెంచడం సరికాదని, రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్ర దాగి ఉందని, దాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని సీఎం పిలుపునిచ్చారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి మెడలు వంచుతామన్నారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని, బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసి రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.