హైదరాబాద్ : కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. కేంద్రమే నేరుగా పల్లెల్లకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారమని నిప్పులు చెరిగారు. రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదని సీఎం అన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక విషయాన్ని మంత్రులు, అధికారుల దృష్టికి సీఎం తీసుకొచ్చారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉన్నదని సీఎం మండిపడ్డారు. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు.
రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని కేసీఆర్ తెలిపారు. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం అనేక రంగాలల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవానుకోవడం సమర్థనీయం కాదని సీఎం అన్నారు.