CM KCR | మహేశ్వరం : బావుల వద్ద 10 హెచ్పీ మోటార్లు పెడితే.. ట్రాన్స్ఫార్మర్లు పటాకులు పేలినట్లు పేలుతాయి.. సబ్ స్టేషన్లు కూడా పేలిపోతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా సంక్షేమం చూసుకున్నాం. అనంతరం రైతులు బాగుపడాలని చెప్పి, వ్యవసాయ స్థీరికరణ కోసం ప్లాన్ చేసుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల కూడా మీకు వస్తది. నీటి తిరువా రద్దు చేశాం. 24 గంటలు ఉత్తమమైన కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్. రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తున్నాం. పండించిన ధాన్యం అంతా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. బ్యాంకులకు డబ్బులు వస్తున్నాయి. దాంతో రైతుల ముఖాలు కళకళలాడుతున్నాయి. ఇందో పది పదిహేను ఏండ్లు ఇస్తే రైతులకు ఆ తర్వాత పెట్టుబడి ఇవ్వాల్సిన అసవరం లేదు. ఆ తర్వాత సొంత పెట్టుబడితో బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ ఇస్తాం అంటున్నడు. 10 హెచ్ పీ మోటార్లు పెట్టుకోవాలని అంటుండు. ఆయన తెలివి తక్కువ తనం ఏందంటే.. 10 హెచ్పీ మోటార్లు పెట్టాలి. 3 గంటల కరెంట్ ఇవ్వాలి. రాంగనే అందరూ వత్తాలి. ట్రాన్స్ఫార్మర్లు పటాకులు పేలినట్లు పేలుతాయి. సబ్ స్టేషన్లు కూడా పేలిపోతాయి. ఉంటాయా..? అంత లోడ్ తీసుకుంటాయా..? ఇప్పుడున్న తీగలు సరిపోతాయా..? రైతులకు ఉన్న తీగలు కూడా సరిపోతాయా..? ఇంత కొంపలగుత్త వ్యవహారం.. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
దీని కన్న డేజంర్ ఇంకోటి మాట్లాడుతున్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తరట. అది భూమతానా..? భూమేతనా..? రైతుల భూములు అన్యాక్రాంతం కావొద్దని, పకడ్బందీగా వ్యవహారం చేశాం. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, నిమిషాల్లోనే మ్యుటేషన్ అయిపోతుంది. ఆన్ది స్పాట్ పట్టా చేతికి వస్తుంది. ఇక ధరణి ద్వారా రైతుబంధు నేరుగా మీ ఖాతాలోకి వస్తుంది. మరి ధరణి బంద్ చేస్తే రైతుబంధు ఎలా వస్తది. పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని భట్టి విక్రమార్క అంటున్నారు. మళ్లీ పైరవీకారులను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఇవాళ లంచం ఇవ్వకుండా, ఎలాంటి దరఖాస్తు పెట్టకుండా నేరుగా మీ వ్యవసాయానికి పెట్టుబడి వస్తుంది. ఆలోచించి నిర్ణయం చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. ఆలోచించి ఓటు వేయకపోతే పదేండ్ల నుంచి కష్టపడ్డదంతా బూడిదలో పోసిన పన్నీరులా తయారువుతుంది. ఆలోచించే ఓటేస్తే భవిష్యత్కు మంచి బాటలు పడుతాయి. లేదంటే ఇబ్బందులు ఏర్పడుతాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.