CM KCR | అచ్చంపేట : రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు.ధరణి పోర్టల్లో రైతుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆ వివరాలు ఉన్నందునే రైతుబంధు నగదు నేరుగా మీ ఖాతాలో పడుతోంది. వడ్లు అమ్మిన తర్వాత కూడా మీ బ్యాంకులో డబ్బులు నేరుగా పడుతున్నాయి. గత ప్రభుత్వాల్లో వడ్లు అమ్మితే నెలకు, రెండు నెలలకు కూడా డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పైరవీకారులు, దళారులు లేరు. ఒక వేళ ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. వీఆర్వోలు, గిర్దావర్లు వస్తరు. మళ్లా ఆఫీసర్ల చుట్టూ తిరగాలి. మళ్లీ పాతక కథ మోపైతది. రిజిస్ట్రేషన్లు ఈజీ అయ్యాయి. మండల కేంద్రాల్లో 15 నిమిషాల్లో అయిపోతున్నాయి. వెంబడే ఆన్లైన్లో మీ భూమి ఎక్కుతుంది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టా 15 నిమిషాల్లో అయిపోతుంది. ఇవన్నీ తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎందుకంటే దళారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు. ఈ దుర్మార్గులను రానిస్తే, రైతుబంధుకు రాంరాం.. దళితబంధు జైభీం అవుతుంది. అప్పుడు కేసీఆర్ను తిట్టినా లాభం లేదు. మీరు ఇవన్నీ ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
మనిషన్నప్పుడు మంచి చెడు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. తిట్టేడు కూడా ఉంటడు. అలాంటి వారు ఎప్పటికీ ఉంటారు. నిజనిజాలు గుర్తించాలి. తెలంగాణ తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్గా ఉన్నాం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లను పండిస్తున్నది తెలంగాణ. ఇది 4 కోట్లు కావాలి.. ఈ ముండవోపులు వచ్చి 2 కోట్లకు తీసుకుపోతరు అని కేసీఆర్ పేర్కొన్నారు.
మేం ఉట్టి మాటలు చెప్పలేదు. నరకలేదు. ఒక చిత్తశుద్ది, నిజాయితీ ఉంటేనే సంక్షేమ, అభివృద్ధి సాధ్యమవుతుంది. మన ఇంటి సంసారం మాదిరిగానే శ్రద్ధతో చేస్తే ఇక్కడి దాకా వచ్చాం. అచ్చంపేట నియోజకవర్గానికి పాలిటెక్నిక్, మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మంజూరు చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.