సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని సీఎం హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి. మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, తెలంగాణలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యాన్ని పండిస్తున్నాం. పంటలు పండించే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. ఏప్రిల్ నెలలో కూడా చెరువులు తొణికిసలాడుతున్నాయి. ఆషామాషీగా, తెలివి లేక ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా గ్రామాలకు వస్తున్నారు. అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోంది. కుక్కలు మొరుగుతున్నాయని మన పనిని ఆపొద్దు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం.
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మన పథకాల గురించి తెలుసుకున్నారు. దేశానికే మార్గదర్శకంగా, గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. పిడికెడు మందితో నేనొక్కడినే బయటకు వచ్చి తెలంగాణను సాధించాం. భారతదేశమే అబ్బురపడే విధంగా తెలంగాణలో అభివృద్ధి ఆవిష్కృతమైంది. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఆదిలాబాద్లో అంటు రోగాలు మాయం అయ్యాయి. మాతాశిశుమరణాలు తగ్గిపోయాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం. కేసీఆర్ కిట్లు 10 లక్షల కుటుంబాలకు మించి పంపిణీ అయ్యాయి. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం అవుతోంది. బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు పోతున్నాం. అనేక రంగాల్లో పురోగమిస్తూ ముందుకు పోతున్నాం. కొంతమంది అవకాకులు చెవకాకులు పేలిన మనం ముందుకెళ్లాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.