CM KCR | నిజామాబాద్ : ఈ చేతగాని దద్దమ్మలు, వెధవలు పని చేసే చేతగాక, ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు, దాడులకు దిగజారుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కత్తులు పట్టి మా అభ్యర్థుల మీద దాడి చేస్తున్నారు. కత్తి పట్టుకొని పొడవాలంటే ఇంత మందిమి ఉన్నాం.. మాకు చేతులు లేవా..? మొండిదో లండిదో మాకో కత్తి దొరకదా..? ఒక వేళ మాకు తిక్కనే రేగితే.. దుమ్ము దుమ్మే రేగాలి ఈ రాష్ట్రంలో. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను. ఇవాళ దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి.. ప్రభాకర్ రెడ్డి మీద కాదు.. కేసీఆర్ మీద దాడి జరిగిందని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
దురదృష్టం ఏంటంటే.. చేతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెధవలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డిపై కత్తిపోట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డారని కేసీఆర్ మండిపడ్డారు. ఇంతకుముందే హైదరాబాద్కు తరలించారు. నేను జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది. వాస్తవానికి అక్కడికి వెళ్లాలనుకున్నాను. అక్కడ హరీశ్రావు, మిగతా మంత్రులు ఉన్నారు. ప్రభాకర్రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేదని చెప్పారు. మీ కార్యక్రమం ముగించుకొని రండి మేమంతా ఉన్నాం.. ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. భగవంతుడి దయతో అపాయం తప్పింది. కానీ, ఇది రాజకీయమా? అరాచకమా..? అంటూ నిప్పులు చెరిగారు కేసీఆర్.
ఈ పదేండ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి.. ఎన్నడు మనం హింసకు దిగలేదు అని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజలు గెలిపిస్తే గెలిచినం.. చేతనైన కాడికి ప్రజలకు సేవ చేసినం తప్ప.. దుర్మార్గమైన పనులు చేయలేదు. ఇవాళ దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి.. ప్రభాకర్ రెడ్డి మీద కాదు.. కేసీఆర్ మీద దాడి జరిగిందని మనవి చేస్తున్నాను. ఈ దాడులను ఆపకపోతే సెల్ప్ కంట్రోల్ చేసుకోకపోతే మాక్కూడా దమ్మున్నది. మేం కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ కూడా మిగలరు. దుమ్ము కూడా మిగలదని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
మేం పదవుల్లో ఉన్నామని, మాకు బాధ్యతలు ఇచ్చారని, తిరిగి ప్రజలకు సేవ చేసే పనిలో ఉన్నాం అని కేసీఆర్ తెలిపారు. కరెంట్ ఎట్ల రావాలి.. నీళ్లు ఎట్ల రావాలి.. నిజాం సాగర్ ఎట్ల నిండాలని పంటలు ఎట్ల పండాలి.. పండిన పంటలను ఎట్ల కొనుగోలు చేయాలి అనే పనుల్లో మేం ఉంటే.. మీరేమో ఈ దుర్మార్గమైన పని చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎజెండా చెప్పండి మీకు దమ్ముంటే.. ప్రజల ముందుకు రండి.. మీ వాదన ఏంటో చెప్పండి. మా వాదన మేం చెప్తం.. ఎవర్ని గెలిపిస్తే వారు పని చేయాలి. లేకుంటే ఎవడికున్న పని వాడు చేయాలి. ఎద్దో, ఎవుసమో ఏదున్నదో అది చూసుకోవాలి. కానీ లంగచాతలు ఏంది..? గూండాగిరి ఏంది..? కత్తులు పట్టి పొడిచేది ఏంది..? అని కేసీఆర్ నిలదీశారు.
గన్మెన్ అప్రమత్తంగా ఉండటంతో ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు బతికాయని కేసీఆర్ తెలిపారు. పాపం గన్మెన్కు కూడా దెబ్బ తగిలింది. మొత్తానికి మోసం తప్పింది.. ఆయన ప్రాణాలకు ఆపాయం లేదు. ఈ రకమైన దాడులను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని తెలంగాణ మేధావి లోకం, పెద్దలు, రాష్ట్ర శ్రేయస్సు కోరేవారందరూ కూడా ఈ దుర్మార్గాలను, హింస రాజకీయాలను ఖండించాలని బాన్సువాడ నుంచి అప్పీల్ చేస్తున్నా. పిరికిపందలు, చేతకాని వారే ఈ పని చేస్తరు తప్ప చేతనైన మొగోడు ఎవరు కూడా ఈ పని చేయడు. తస్మాత్ జాగ్రత్తా.. అని హెచ్చరిస్తున్నానని చెప్పి కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.