పెద్దపల్లి : రైతుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. రైతులకు మీటర్ పెట్టాలని అంటున్న ఈ మోదీకే మీటర్ పెట్టాలన్నారు. పెద్దపల్లి జిల్లా కలెకర్టేట్ ప్రారంభం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
రైతులకు మేలు చేస్తూ పేదలను ఆదుకుంటుంటే వాటిని ఉచితాలు అని బంద్ పెట్టాలని అంటున్నారు. ఉచిత కరెంట్ ఇస్తే మీటర్ పెట్టాలని అంటున్నారు. రేపు రాబోయే భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతుంది. ఈ గోల్ మాల్ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్దాల ఆడుతూ, దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. దేశంలోని మొత్తం వ్యవసాయానికి వాడే కరెంట్ కేవలం 20.8 శాతం మాత్రమే. దాని ఖరీదు ఒక లక్షా 45 వేల కోట్లు.ఓ కార్పొరేట్ దొంగకు దోచిపెట్టినంత కాదు కదా మోదీ. రైతుల కోసం మీరు బయల్దేరండి అని ఆయా రాష్ట్రాల రైతులు నన్ను కోరారు. మీటర్ లేని రైతు రావాలని కోరారు. భారతదేశం స్వాగతం పలుకుతుందన్నారు. రైతులకు మీటర్ పెట్టాలని అంటున్న మోదీకి మనందరం కలిసి మీటర్ పెట్టాలి. ఆ పని చేస్తే మనకు పీడ వోతది. ఏ ఒక్క రంగంలో కూడా దేశాన్ని బాగు చేసింది లేదు. అనేక రంగాల్లో అవినీతి నెలకొని ఉందని కేసీఆర్ ధ్వజమెత్తారు.