హైదరాబాద్ : విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వకుండా, పేదల ప్రజల ఉసురు పోసుకుంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు, ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గిరిజనులను, ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో బంజారాహిల్స్లో దాదాపు రూ. 60 కోట్ల ఖర్చులతో కుమ్రం భీం ఆదివాసీ, సేవాలాల్ బంజారా భవన్లను ప్రారంభించుకున్నాం. సమస్త గిరిజన, ఆదివాసీ జాతికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంది గిరిజన ఉద్యోగులు, మేధావులు, కవులు, రచయితలు ఉన్నారు. గిరిజన సమస్యల గురించి మాట్లాడారు. అవి పరిష్కారం అయ్యేందుకు ఆదివాసీ, బంజారా భవన్లు వేదికలు కావాలి. ఈ చర్చల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆదివాసీ, గిరిజన మేధావి వర్గాన్ని కోరుతున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. వాలటన్నింటి పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలి. ఆ వేదికలను ఉపయోగించుకొని, మేధోమథనం చేయాలి.
తెలంగాణ కోసం జాతి కులం మతం అనే బేధం లేకుండా 58 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాం. ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు సమస్యలు సంభవిస్తాయి. కానీ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వకుండా.. బీజేపీ ప్రభుత్వం విద్వేష, విభజన రాజకీయాలు చేస్తుంది. మాకు వచ్చే న్యాయమైన హక్కు అడుగుతున్నాం. ఈ దేశంలో 8 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏ వర్గం ప్రజలకైనా మంచి పని చేసిందా? మనం కూడా ఈ దేశంలో భాగమే కదా? ఎందుకు హక్కులు ఇవ్వడం లేదు. అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. పేదల ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ప్రజల ఆస్తులను ఉచితంగా కార్పొరేట్లకు దోచి పెడుతున్నారు. సంకుచితమైన పెడధోరణితో వ్యవహరిస్తున్నారు. అనేక కష్టాలు, నష్టాలకొర్చి, ప్రాణాలు కోల్పోయి తెచ్చుకున్న తెలంగాణ మరో కల్లోల్లానికి గురి కావొద్దు. అందరూ ఐకమత్యంంగా ఉండాలి.
అమాయకులైన గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. వారికి ఇవ్వడానికి భూములు గుర్తించాం. కమిటీలు ఏర్పాటు చేశాం. అందుకు సంబంధించిన 140 జీవో జారీ చేశాం. అందరూ యాక్టివ్గా ఉండి నివేదికలు పంపిస్తే పట్టాలిస్తాం. గిరిజన సోదరుల కోసం తండాలను పంచాయతీలుగా చేశాం. తండాలు, ఆదివాసీ గూడెంలలో వారే పరిపాలించుకుంటున్నారు. మూడు ఫేజుల కరెంట్ ఇస్తున్నాం. గురుకులాలను ఏర్పాటు చేశాం. రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా తండాలకు, గూడెంలకు మంచినీరు అందిస్తున్నాం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఇచ్చే నీళ్లే.. ఆదిలాబాద్ గూడెల్లో, అచ్చంపేట చెంచు పెంటల్లో కూడా అందిస్తున్నాం. తండాల్లో విషజ్వరాలు లేవు. ఆకలి చావులు లేవు. కడుపు నిండా అన్నం పెడుతున్నాం. అన్ని పథకాలు అందుతున్నాయి. ఉన్నంతలో మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గిరిజన సంస్కృతిని కాపాడుతున్నాం. అనేక పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నాం. మనకు అధికారం రావడంతో ఈ కార్యక్రమాలను సఫలికృతం చేసుకుంటున్నాం. మన జాతి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.