నిజామాబాద్ : భారతదేశ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం రాబోతుందని, దేశ రైతులందరికి ఉచిత నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
2024 తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాన్ బీజేపీ జెండానే ఎగురతది. దిక్కూమలిన, రైతుల వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం. ఢిల్లీ గడ్డ మీద మన ప్రభుత్వమే రాబోతేంది. 2024లో ముక్తు భారత్ నినాదంతో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. భారతదేశ యావత్ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తున్నాను. దేశ రాజకీయాల్లోకి పోదామా? ఈ దేశం కోసం తెలంగాణ నుంచి పోరాటం చేయాలి. ఎవరైతే బాయికాడ మీటర్ పెట్టమని అంటున్నారో.. ఎవరైతే రైతాంగాన్ని ఆత్మహత్య చేసుకోవాలని చెప్తున్నారో.. మనందరం ఏకమై వారికే మీటర్ పెట్టాలి. అట్ల అయితనే బాగుపడుతాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి వరం భారతదేశానికి ఉంది. దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉంది. 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూల భూములు ఉన్నాయి. బ్రహ్మాండమైన నదులు ఉన్నాయి. ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్ లేదు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదు. అన్ని అమ్ముకునుడు తప్ప కొత్తది చేయలేదు. దయ చేసి రైతు సంఘాలు, రైతు బిడ్డలు సమావేశాలు పెట్టి రైతు వ్యతిరేక విధానం అవలంభిస్తున్న పార్టీలను తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు.