CM KCR | హాలియా : జానారెడ్డి పీరియడ్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాలుగు రోడ్లు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హాలియాలో ఏర్పాటు చేసిన నాగార్జున సాగర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
జానారెడ్డి గురించి విమర్శ చేయదలుచుకోలేదు. కానీ జానారెడ్డి పీరియడ్లో ఆయన ఆర్ అండ్ బీ మినిస్టర్గా ఉన్నప్పుడు నాలుగు రోడ్లు తప్ప ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమం జరగలేదు. రేపు కూడా జరిగేది ఏం ఉండదు. భగత్ యువకుడు మీ మధ్యలో ఉంటడు. బలహీనవర్గాల బిడ్డ. వాళ్ల తండ్రి నర్సింహయ్య కమ్యూనిస్టు పార్టీ యోధుడు. చాలా రోజులు ప్రజా సేవ చేశారు. ఆయన ఆకస్మాత్తుగా చనిపోతే ఆయన కొడుక్కే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. మంచి ఉత్సాహమైన యువకుడు.. విద్యావంతుడు. వినయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే కులం, మతం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగుతది.. లాభం జరుగుతంది. భగత్ను గుండెలకు హత్తుకుని 80 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండి. అభివృద్ధి నా బాధ్యత అని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇప్పటి కూడా ప్రజాస్వామ్యంలో పరిణితి రాలేదు. ఎలక్షన్లు చాలా వస్తాయి.. చాలా పోతాయి. మీరు కూడా చాలాసార్లు చాలా మందికి ఓటేశారు. గెలిపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక హక్కు ఓటు. ఈ ఓటు ఆషామాసీగా వేసేది కాదు. ఎవరి చేతుల్లో రాష్ట్రం క్షేమంగా ఉంటుందో ఆలోచించాలి. పార్టీల గురించి కూడా లోచించాలి. ఏ పార్టీకి అధికారం ఉంటే ఏం చేశారు. ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితం, ప్రజలకు మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్లు. కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు. 50 ఏండ్లు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది. పదేండ్ల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఎవరి కాలంలో ఏం జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ తండాలకు, గ్రామాలకు వెళ్లిన తర్వాత పది మందితో చర్చ పెట్టాలి అని కేసీఆర్ సూచించారు.