హైదరాబాద్ : దేశంలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ల వ్యవస్థ సరిగా లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. దేశంలో కొందరు గలీజ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికపై కేసీఆర్ మాట్లాడారు.
గవర్నర్ల వ్యవస్థ సరిగా లేదన్నారు కేసీఆర్. మహారాష్ట్ర ప్రభుత్వం 12 మంది ఎమ్మెల్సీల కోసం కేబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక ఏడాది పాటు ఆయన దగ్గర్నే పెట్టుకున్నాడు. తమిళనాడు అసెంబ్లీ బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ రాష్ట్ర గవర్నర్ వింత ధోరణితో ప్రవర్తించాడు. బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో గవర్నర్ల పంచాయితీ ఉందని సీఎం తెలిపారు.
ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రజలకు మంచి పని చేయాలని భావించారు. యువకులుగా మేం నాడు పని చేశాం. 200 మంది ఎమ్మెల్యేలతో అదికారంలోకి వచ్చారు. ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి, స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీఆర్ను పదవి నుంచి తొలగించారు. ఇదంతా మన కళ్లారా చూశాం. హైదరాబాద్లో జరిగిన చరిత్ర ఇది. నాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి.. తిరిగి ఎన్టీఆర్ను అదే సింహాసనం మీద కూర్చొబెట్టారు. ఎన్టీఆర్తో దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ గవర్నర్.. అవమానం పడి ఇక్కడ్నుంచి తొలగించబడ్డారు. దాన్నుంచి ఈ దేశం గుణపాఠం నేర్చుకోవాలి. కానీ దానికి వక్రమార్గంగా గవర్నర్ల వ్యవస్థ ఉందన్నారు కేసీఆర్.
ఈ దేశం సరైన పద్ధుతుల్లో ముందుకు పోవాలంటే.. రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టుగా అమలు కావాలంటే, అంబేద్కర్ స్ఫూర్తి నిజం కావాలంటే, మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతో, కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టినట్లే దేశం కోసం ఒక శక్తి తప్పకుండా పుడుతుంది. తెలంగాణ తరహాలోనే భూకంపం పుట్టించి- విద్రోహ శక్తులను తరిమికొడుదామని కేసీఆర్ పిలుపునిచ్చారు.