CM KCR | మెదక్ : కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతిలో గెలవడం చేతగాక.. దాడులకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కత్తులతో దాడి చేశారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ఖేడ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రభాకర్ రెడ్డి శరీరంలోకి మూడు ఇంచుల లోతులో కత్తి దిగింది అని కేసీఆర్ తెలిపారు. దేవుని దయ వల్ల ఆయన ప్రాణానికి అపాయం లేదు. మన కార్యకర్తలు రక్తం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. మనసు బాగా లేకున్నా.. కనీసం కనబడి నమస్కారం పెట్టి పోదామని చెప్పి ఇంత దూరం వచ్చాను. హైదరాబాద్ వెళ్లి ప్రభాకర్ రెడ్డి పరామర్శించాలి. అన్యత భావించొద్దు.. ఎన్నికల అనంతరం మీకు కావాల్సినవన్నీ మంజూరు చేయిస్తాను. ఈ చేతగాని కాంగ్రెస్ దద్దమ్మలు.. ఇదే హింస అనుకుంటే.. మాకు తిక్కరేగితే ఏం జరుగుతదో ఊహించుకోవాలి. హింసకు తెగబడుతున్నారు. ఈ హింసను ఖండిస్తున్నాను. అభ్యర్థుల మీద కత్తి పోట్లు ఏంటి.. మొండి కత్తో.. లండికత్తో మనకు దొరకదా..? అదే పని మనం చేయాలనుకుంటే చేయలేమా..? పది సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు.. న్యాయబద్దంగా, ధర్మబద్దంగా ప్రజలకు పనులు చేశాం. పేదలను, అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాం. తొమ్మిదేండ్ల నుంచి ఒక్క కర్ఫ్యూ లేదు. కరువు లేదు.. బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే కండ్లలో నిప్పులు పోసుకుని, మన మీద దాడులు చేస్తున్నారు. ఇటువంటి దాడులను తిప్పికొట్టాలంటే మనం ఓటు ద్వారానే బుద్ది చెప్పాలి.. కండ్లు తెరిపించాలి అని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
నారాయణఖేడ్ చరిత్రలోనే మంచి నాయకుడు ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మీ కోసం పరితపిస్తున్నాడు. తండాలకు రోడ్లు వేసుకున్నాం. 100 తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. పోడు భూములను పంపిణీ చేసుకున్నాం. ఈ కార్యక్రమాలు గతంలో జరగలేదు. ఇవన్నీ మంచి పనులు జరిగాయి కాబట్టి.. గతం కంటే భారీ మెజార్టీతో భూపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కేసీఆర్ కోరారు.