CM KCR | తాండూరు : కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
రైతుబంధు తప్పకుండా ఉంటది.. ఉండుడే కాదు. రేపు రోహిత్ రెడ్డి గెలిస్తే 10 వేలనుంచి 16 వేలకు పోతది. రోహిత్ గెలిస్తేనే ఉంటది. కత్తి ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదు కదా..? రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే వాళ్లు మిమ్మల్ని కాపాడుతారు. 24 గంటల కరెంట్ ఉంటది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే కరెంట్ ఆగమైపోతది. కాబట్టి మీరు రోహిత్కు ఓటేయాలి.
ఇంకో డేంజర్ మాట చెబుతున్నారు కాంగ్రెసోళ్లు. వీఆర్వోల రాజ్యం, ప్రభుత్వం చేతిలో రైతుల బతుకు ఉండే. ఇప్పుడు మీ బొటనవేలు పెడితేనే భూ యజమాన్యం మారుతది. ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్రభుత్వం మీకు ధారపోసిన ఆ అధికారాన్నిపొడగొట్టుకుంటారా..? కాపాడుకుంటారా..? అనేది మీరే నిర్ణయించుకోవాలి అని కేసీఆర్ సూచించారు.
కాంగ్రెసోళ్లు చెప్తున్నారు అధికారంలోకి వస్తే అది వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తరట. భూమత పెడుతరట. అది భూమాతనా..? భూ మేతనా..? ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా రావాలి. ఇది తీవ్రమైన సమస్య. రైతాంగానికి జీవన్మరణ సమస్య. కాబ్టటి మీరంతా సీరియస్గా ఆలోచించాలి. మేం పాత పద్ధతి పెడుతామని చెప్తున్నారు. మళ్లీ పట్వారీలు, పాత కథనే వస్తది. మళ్లీ దళారి రాజ్యమే వస్తది. కాంగ్రెస్ అంటేనే దళారీ, పైరవీకారుల రాజ్యం. మన భూములు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతుంది. చాలా కష్టపడి ధరణి తెచ్చాం. కరెంట్ తెచ్చాం. అవన్నీ కూడా తీసేస్తాం అంటున్నారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.