CM KCR | హైదరాబాద్, అక్టోబర్30 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో గెలవడం చేతకాక కత్తులతో దాడులు చేస్తారా?.. మాకు తిక్కరేగితే దుమ్ము దుమ్ము చేస్తం అని ప్రతిపక్షాలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ‘చేతకాని దద్దమ్మలు, వెధవలు, సిద్దిపేట జిల్లాలో మా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం చేశారు. భగవంతుడి దయతో ప్రాణాపాయం తప్పింది. ఇది రాజకీయమా? అరాచకమా? మంచిగా పనిచేసే పార్టీపై, నాయకులపై దాడులా? తెలంగాణ రాష్ర్టాన్ని ఆనాడు సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక కత్తులతో దాడులు చేస్తున్నారు. ఇది ప్రభాకర్రెడ్డిపై దాడి కాదు. కేసీఆర్ మీద దాడి. మాకే తిక్కరేగితే దుమ్ము దుమ్ము రేగుతది. సహనాన్ని పరీక్షిస్తే మా దమ్మేందో చూపిస్తాం.. తస్మాత్ జాగ్రత్త’ అని నిప్పులు చెరిగారు. బాన్సువాడ, నారాయణఖేడ్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు గెలిపిస్తే గెలిచామని, ఎజెండా చెప్పి ప్రజలు గెలిపిస్తే పనిచేయాలె తప్ప గూండాగిరి ఏంటని ధ్వజమెత్తారు.
ప్రజాసేవకులపై దాడులా.. తస్మాత్ జాగ్రత్త!
సమస్యలపై యుద్ధం చేసుకుంటూ, శత్రువులను సైతం ఇబ్బంది పెట్టకుండా తాము ముందుకు పోతున్నామని, కానీ ప్రతిపక్ష పార్టీల వెధవలు దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తిపోట్లకు పాల్పడి దారుణం చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ గన్మెన్ అప్రమత్తంగా ఉండబట్టి, ఆ దుర్మార్గుడిని పట్టుకుంటే భగవంతుడి దయవల్ల ప్రాణాపాయం తప్పిందని వివరించారు. మంచి పనిచేసేవాళ్లను, మంచి పనిచేసే పార్టీలను ఇలా చేయడం ఏమిటని నిలదీశారు.
కత్తులు పట్టుకొని తమ అభ్యర్థులపై దాడులు చేస్తున్న వారికి తెలంగాణ సమాజమే బుద్ధిచెప్పాలని కోరారు. ‘కత్తి పట్టుకొని పొడవాలంటే ఇంతమంది ఉన్న మనకు చేతులు లేవా? మొండిదో.. లండుదో కత్తి మాకు దొరకదా?’ అని నిప్పులు చెరిగారు. పదేండ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయని, తాము ఏనాడూ హింసకు దిగలేదని, ప్రజలు గెలిపిస్తే చేతనైనకాడికి సేవ చేస్తున్నాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలేదని అన్నారు. ‘ఈ దాడులు ఆపకపోతే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్ము ఉన్నది. మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ కూడా మిగలరు. దుమ్ము కూడా మిగలదు. మేం బాధ్యతతో ఉన్నాం’ అని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మేం ప్రజలకు సేవ చేయాలనే పనుల్లో నిమగ్నమై ఉన్నం. కరెంటు ఎట్ల రావాలె, నీళ్లు ఎట్ల రావాలె, నిజాంసాగర్ ఎట్ల నిండాలె, పంటలు ఎట్ల పండాలె, పండిన పంటలను ఎట్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనాలె అనే పనుల్లో ఉన్నం.
వారు (ప్రతిపక్షాలు) దుర్మార్గమైన పనులు చేసుకుంటూ ముందుకుపోతున్నరు. ఇకనైనా హింసా రాజకీయాలు వదిలి దమ్ముంటే ఎజెండా చెప్పండి. ప్రజలముందు మీ వాదన మీరు చెప్పిండి. మా వాదన మేము చెప్తాం. ఎవరిని గెలిపిస్తే వాళ్లు పనిచేయాలె, లేకుంటే ఎవరికున్నపని వాడు చూసుకోవాలి. కానీ ఈ లంగా చేతలేంది. గూండాగిరీ ఏందీ? కత్తులుబట్టి పొడుచుడేంది?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతగానివాళ్లే ఇలాంటి పని చేస్తారు తప్ప చేతనైన మొగోడు ఎవ్వడూ ఇటువంటి పని చేయడని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తెలంగాణ మేధావిలోకం, పెద్దలు, తెలంగాణ శ్రేయస్సు కోరేవారందరూ ఈ దుర్మార్గాన్ని, ఈ హింసా రాజకీయాలను, పద్ధతులను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.