హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా తెలంగాణ ఉన్న సమయంలో సమైక్య పాలకులు వివక్ష చూపారని, స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరమన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం తీరును ఎండగట్టారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచే వివక్ష ప్రారంభమైందని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టిందని, దీంతో లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మనం కోల్పోయామన్నారు.
‘దీంతో కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆనాటి నుంచి నేటివరకూ మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తున్నది. ఐదేళ్లపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. మన హైకోర్టు మనకు ఏర్పాటైన తర్వాత అవసరమైన సిబ్బందిని, నిధులను, భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నాం. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశంసించారు’ అని తెలిపారు.
‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కొన్నదో అందరికీ తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు నయాపైసా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయంగా రావల్సిన నిధులపై కూడా కోత విధించింది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆ నాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ, ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో తగని జాప్యం చేస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రాత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొంది. కానీ, కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు ఏవీ ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదు’ అన్నారు.
‘తెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. ఇది అమలుచేసి ఉంటే ఐటీ రంగం మరింతగా పురోగమించి ఉండేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని స్పష్టంగా పేర్కొన్నది. కానీ, ఇపుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తున్నది. ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన మన వైద్య విద్యార్థులకు ఎదురైన దుస్థితి మనకు తెలుసు.
వీరంతా మన దేశంలోనే వైద్యవిద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాశాను. మన రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్యకు అయ్యే ఖర్చును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలియజేశాను. కానీ, కేంద్రం నుంచి దీనికి ప్రతిస్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదం. ఈ విషయంలో కేంద్రం ఉదాసీనతను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తున్నది’ అన్నారు.
‘తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అసమర్థతతో చేతులెత్తేసింది. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని నాతో సహా ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేసినం. అయినా ఫలితం లేకపోవడంతో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలసి ఢిల్లీలో ఒకరోజు జరిపిన నిరశన దీక్షలో నేను స్వయంగా పొల్గొన్నాను. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ కూడా మనకు మద్దతుగా ఈ దీక్షలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై 24 గంటల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తే సానుకూలంగా జవాబు రాలేదు. స్పందన లేదు’ అన్నారు.
‘తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడిండు. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతులు భిక్షగాళ్లు కాదు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి. లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాను. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
కేంద్రం మొండి చెయ్యి చూపినా మన రైతాంగాన్ని ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటం విద్యుక్త ధర్మంగా భావించి, రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించింది. ధాన్యం దిగుబడి, కొనుగోళ్ళలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించింది. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి నేను భరోసా ఇస్తున్నాను’ అన్నారు.
‘ప్రపంచ దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల పర్యవసానంగా రాచరిక, నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయి. అత్యధిక దేశాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ, పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నాయి. పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం పరిణతి చెందేకొద్దీ ఆయా దేశాలు అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారికతను పెంపొందించాయి. పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. కానీ, మన దేశంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి.
విశాలతరం కావల్సిన సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నది. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించింది. ఇప్పటివరకూ కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాశాయి. అధికారాలను నిస్సిగ్గుగా హరించాయి. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కేంద్రం పరిధిలోని అధికారాలనూ, రాష్ట్రాల పరిధిలోని అధికారాలనూ స్పష్టంగా నిర్వచించింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలను నిర్దేశించింది.
‘దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతున్నది. రాష్ట్ర జాబితా తరుగుతున్నది. రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నది. గతంలో
కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన సర్కారియా, పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయి. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల నివేదికలను బుట్ట దాఖలు చేశాయి.
ఇప్పటి వరకూ దేశాన్ని ఏలిన ఈ ప్రభుత్వాలు అనుసరించిన ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏరకంగానూ మంచి చేయజాలకపోగా, దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది.