CM KCR | ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పంటకాలానికి ముందు తెలంగాణ అంతటా ఒకే దృశ్యం. ఎరువుల కరువు, రైతుల ఇక్కట్లు, టోకెన్లు, చెప్పుల బారులు, బస్తాల కోసం కుస్తీలు, లారీలపై దాడులు, విరిగిన లాఠీలు, దుకాణాల లూటీలు!
తెలంగాణ రాష్ట్రంలో ఈ దృశ్యం అదృశ్యమైంది. ఇప్పుడెక్కడా ఎరువుల కరువు లేదు. రైతుల బారులు, బాధలూ లేవు. బ్లాక్ మార్కెటింగ్ లేదు. కొట్లాటలు, క్యూలైన్లు లేవు. గోడౌన్లలో గుట్టలకొద్దీ ఎరువులు సీజన్కు ముందే సిద్ధంగా ఉంటున్నాయి.
గడిచిన 9 ఏండ్లలో పంటల సాగు విస్తీర్ణం పెరిగి ఎరువుల వినియోగం రెట్టింపైంది. అయినప్పటికీ ఎక్కడా కొరత ఎందుకు లేదు? దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఉన్నది. ముందుచూపు ఉన్నది, ఎరువుల, విత్తనాల కరువును దూరం చేసిన ప్రణాళిక ఉన్నది.
పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మకాలు, రైతులపై లాఠీచార్జీలు, రోజుల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు, ఇంతా చేస్తే చివరికి దొరికేది ఒకటో రెండో బస్తాలు.. ఇవీ ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల గోసకు అద్దంపట్టే దుర్భర పరిస్థితులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతులు ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరం లేదు, క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి లేదు. ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇలా వచ్చి అలా తీసుకెళ్లే పరిస్థితి. నాటితో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఎరువుల వినియోగం ఏకంగా 50 శాతానికిపైగా పెరిగింది. అయినా ఎరువుల కొరత అనే మాటే వినిపించటంలేదు. ఇందుకు కారణం ఏంటి? దశాబ్దాలపాటు తీరని కష్టం రాష్ట్ర ఏర్పడిన ఏడాదిలోనే ఎలా తీరింది? ఎరువుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం పడిన కష్టం ఎంత? సీఎం కేసీఆర్ ఏం ప్లాన్ చేశారు? వ్యవసాయ శాఖ దానిని ఎలా అమలు చేసింది?
కొమ్మిడి స్వామిరెడ్డి
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడే నాటికే ఎరువుల కొరత భారీగా ఉన్నది. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ సమస్యపై దృష్టిసారించారు. రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి, నేటి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితోపాటు వ్యవసాయశాఖ అధికారులతో సుదీర్ఘ మంతనాలు నిర్వహించారు. ఎరువుల కొరత ఎందు కు వస్తున్నది? ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి ఏంటి? కేంద్రంలో ఎరువుల నిల్వలు ఏ స్థాయిలో ఉ న్నాయి? అనే అంశాలపై ఎప్పటికప్పుడు తెలుసుకొన్నారు. ఈ అంశాల ఆధారంగా సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనేదానిపై సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు.
చిన్న లాజిక్తో తీరిన ఎన్నో ఏళ్ల సమస్య
మనదేశంలో ఏడాదంతా పంటల సాగుతీరు ఒకేలా ఉండదు. ఏడాదిలో నాలుగైదు నెలలు ఎరువులతో రైతులకు అవసరమే ఉండదు. ఆ సమయంలో రాష్ర్టాలు కేంద్రం నుంచిఎరువులను కొనవు. ఈ లాజిక్నే సీఎం కేసీఆర్ దొరకబట్టారు. ఇతర రాష్ర్టాలకు ఎరువులు అవసరం లేని సమయంలో ఆ ఎరువులను మన రాష్ట్రం కొనుగోలు చేయాలి. తద్వారా సీజన్కు ముందే రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలి’ అని అధికారులకు నిర్దేశించారు.
‘శీనన్నా.. ఏప్రిల్ వచ్చింది.. ఢిల్లీకి పోయొచ్చినవా?
ఎరువుల సమస్యను పరిష్కరించడంలో నాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కీలక పాత్ర పోషించారు. సీజన్కు ముందుగానే ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడి.. ఎరువుల సరఫరాకు లైన్ క్లియర్ చేసేవారు. ఒక సీజన్ పూర్తయిందంటే చాలు.. తర్వాతి సీజన్కోసం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రికి ఎరువుల గురించి గుర్తు చేసేశారు. ‘శీనన్నా ఢిల్లీకి పోయొచ్చినవా? ఏప్రిల్ నెల వచ్చింది.. సీజన్ దగ్గరపడ్తున్నది’ అని గుర్తు చేసేవారు.
5 లక్షల టన్నులకు బఫర్ స్టాక్ పెంపు
భవిష్యత్తు అవసరాల కోసం (బఫర్ స్టాక్) లేకపోవడమే నాటి ఎరువుల గోసకు ప్రధాన కారణం. రాష్ట్రం ఏర్పడే నాటికి 1.5-2 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే బఫర్ స్టాక్ ఉండేది. అవి ఏ మూలకూ సరిపోయేవి కావు. దీంతో బఫర్ స్టాక్ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఏప్రిల్, మే నెలల్లోనే కేంద్రం నుంచి ఎరువులు కొనుగోలు చేసి బఫర్ స్టాక్ను 5 లక్షల టన్నులకు పెంచింది. ముందస్తు ఎరువుల కొనుగోలు కోసం అదనంగా దాదాపు రూ. వెయ్యి కోట్లు అందజేసేవారు. 2015 నుంచి నేటి వరకు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు.
రేక్ పాయింట్స్, స్టోరీజీ పెంపు
ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కాస్త ఎరువులను కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు, నిల్వ చేసేందుకు కనీస వసతులు ఉండే వి కావు. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా కొనుగోలు చేసిన ఎరువులను సీజన్కు ముందే క్షేత్రస్థాయికి పంపిణీ చేసి, సురక్షితంగా నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. రైలులో వచ్చే ఎరువులను నేరుగా జిల్లా స్థాయికి చేర్చేందుకు రేక్ పాయింట్స్ను పెంచింది. రైల్వే, ఎరువులు, రసాయనాల శాఖలతో చర్చలు జరిపి రేక్ పాయింట్స్ను 15 నుంచి 20కి పెంచింది. 2014లో 7.38 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములుండగా, ప్రస్తుతం 24.66 లక్షల టన్నులకు పెంచింది.
పంపిణీ వ్యవస్థ పటిష్టం
గతంలో తక్కువ ఎరువులకు తోడు గందరగోళమైన పంపిణీ వ్యవస్థతో రైతులకు ఇబ్బందులు పెరిగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్ది పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసింది. ఇందుకోసం గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)ను ఎరువుల విక్రయంలో మరింత కీలకం చేసి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఆగడాలకు చెక్ పెట్టింది. ఎరువుల పంపిణీని మొత్తం ఆన్లైన్ చేసింది. ఏ జిల్లాలో ఎంత ఎరువులు అవసరం? ఎంత స్టాకు ఉన్నది? ఎవరి వద్ద ఎంత ఉన్నది? ఏ రైతుకు ఎన్ని ఎరువుల బస్తాలు విక్రయించారు? అనే వివరాలను కూడా ఆన్లైన్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీని చేపట్టింది.
వినియోగం పెరిగినా కొరత లేదు
నేడు వ్యవసాయం పండుగైంది. పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. అయినా కొరత లేదు. 2014లో రాష్ట్రంలో 1.31 కోట్ల ఎకరాల్లో సాగైతే, 2022-23లో ఇది 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. 9 ఏండ్లలో 90 లక్షల ఎకరాలు పెరిగింది. వరి విస్తీర్ణం 2014-15లో రెండు సీజన్లలో కలిపి 35 లక్షల ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 1.20 కోట్ల ఎకరాలకు చేరింది. 2014లో అన్ని ఎరువులు కలిపి 25 లక్షల టన్నులు వినియోగించగా, 2022 లో 40 లక్షల టన్నులకు పెరిగింది.
కావాల్సినంత యూరియా
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న ఎరువుల సమస్యలో ప్రధానమైనది యూరి యా కొరత. ఏ పంటకైనా యూరియానే ప్రధాన ఎరువుగా రైతులు వినియోగిస్తారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం యూరియా కొరతను అధిగమించగలిగింది. నాడు ఏడాదికి 13 లక్షల టన్నుల యూరియా వినియోగించగా, ప్రస్తుతం 20 లక్షల టన్నులకు పెరిగింది. అయినా కొరత లేకుండా రైతులకు యూరి యా పంపిణీ చేసింది. ఇందుకోసం ఎరువుల బఫర్ స్టాక్లో ఎక్కువగా యూరియాను ఉంచేది. గతంలో కేవలం లక్ష టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంటే ఇప్పుడు 4 లక్షల టన్నుల యూరియాను బఫర్స్టాక్గా పెడుతున్నారు.
కేసీఆర్ ఆలోచనే రైతుల కష్టం తీర్చింది
2014 జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నన్ను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించారు. ఆ తర్వాతి రోజే నన్ను పిలిచి ‘శీనన్నా రాష్ట్రంలో ఎరువుల కొరత చాలా ఉన్నది. రైతులు ఇబ్బంది పడుతున్నరు. ఏం చేద్దాం’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఎరువుల సమస్యపై అనేకసార్లు సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ర్టాలకు ఎరువులు ఆలస్యంగా వెళ్తాయని తెలిసి, ఆ రాష్ర్టాలు తీసుకోని ఎరువులను మనమే కొనుగోలు చేద్దాం.. కేంద్ర అధికారులతో మాట్లాడండి అని సీఎం కేసీఆర్ మమ్మల్ని ఢిల్లీకి పంపించారు. రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి ముందుగా ఎరువులు సరఫరా చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించాం. ఇలా ముందుగానే ఎరువులు తెచ్చి బఫర్ స్టాక్ను పెంచుకున్నాం. రేక్ పాయింట్స్ను, గోదాముల సామర్థ్యాన్ని పెంచాం. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో పనిచేసి రైతుల ఎరువుల కష్టాలను తీర్చినం.
-పోచారం శ్రీనివాస్రెడ్డి, నాటి వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్
కొరత లేకుండా చూస్తున్నాం
సీజన్కు ముందే ఎరువులను సిద్ధం చేసి, రైతులకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్తూ, అవసరమైన నిల్వలను రాష్ర్టానికి తీసుకొస్తున్నాం. ఎంత అవసరమైనా రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎరువుల నిల్వలకు గోదాములు పెంచినం. పంపిణీ వ్యవస్థను సైతం పటిష్టం చేశాం.
– వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
రెండు సీజన్లకూ ఎరువులు దొరుకుతున్నాయి
నాకు మూడెకరాల భూమి ఉం ది. తెలంగా ణ సర్కారు అందిస్తున్న సాయంతో నేను రెండు పంటలు పండిస్తున్నాను. వాన కాలంలో సోయాబీన్, యాసంగిలో శనగ వేస్తాను. తెలంగాణ రాక ముం దు నాలుగైదు రోజులు పడిగాపులు కాస్తేగాని మందుబస్తాలు దొరికేవి కావు. . ఇంత కష్టపడినా చివరకు ఎరువులు దొరుతాయో లేదో తెలి యని పరిస్థితి ఉండేది. రాష్ట్రం వచ్చి నప్పటి నుంచి సీజన్కు ముందుగానే దుకాణాల్లో మందుబస్తాలు సిద్ధంగా ఉంటున్నాయి.
– కాంబ్లే రాము, రైతు, ముక్రా(కే), ఆదిలాబాద్ జిల్లా
బతికినన్ని రోజులు కేసీఆర్ను మరువం
ఇసొంటి సీఎంను మునుపు ఎన్నడూ సూడలే. పంట ఎయ్యక ముందునుంచీ కోసిందాక మస్తు సాయం జేస్తుండు అప్పట్ల ఇత్తనాలు, యూరియా కోసం తిప్పలు పడుతుంటిమి. వారం వారం రోజులు తిరుగాల్సి వస్తుండె. ఇప్పుడు ఫుల్లుగా రెడీగా ఉంచుతున్నారు. రైతుకు ఇన్ని చేస్తున్న కేసీఆర్ సారును బతికినన్ని రోజులు మరువం.
-దోండేబారావ్ (రైతు), ధర్మారం, కామారెడ్డి జిల్లా