CM KCR | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తోడబుట్టిన అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగే రక్షాబంధన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తున్నదని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తున్నదని తెలిపారు. రాఖీని రక్షాబంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని, అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అకాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని గుర్తుచేశారు. మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగిస్తున్నదని వివరించారు. సంపదను సృష్టించి సకల జనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ, సహోదరభావాన్ని పెంచుతున్నదని పేర్కొన్నారు. అనేక పథకాలను అమలు చేస్తూ, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానందిస్తూ పెద్దన్నలా రక్షణగా నిలిచిందని తెలిపారు. తత్ఫలితంగా నేడు తెలంగాణలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.