హైదరాబాద్ : ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఏసు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు.
ఒక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా, మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో, క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం ఉండాలని క్రీస్తు బోధించారని, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని సీఎం ఆకాంక్షించారు.