హైదరాబాద్: గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. మృతుల కుంటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను అధికారులు గుర్తించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి నిరంజన్రెడ్డి మృతులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున గోడ కూలడంతో ఐదుగురు మృతిచెందారు. కొత్తపల్లికి చెందిన మోష శనివారం రాత్రి తన భార్య, ఐదుగురు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. వర్షానికి గుడిసె గోడ కూలింది. దీంతో భార్యాభర్తలతోపాటు ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.