CM KCR on Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహకు గురి చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దశ, దిశ, నిర్దేశం లేని, పసలేని నిష్ర్పయోజనకర బడ్జెట్ ఇది అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నేడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్.. దశ దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడి వున్నదని అని సీఎం వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ, మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్గా కేంద్ర బడ్జెట్ను సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ను బిగ్ జీరో అని సీఎం స్పష్టం చేశారు.
దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
ఇన్ కం టాక్స్లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సీఎం అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని , వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందన్నారు.
వైద్యం తదితర ప్రజారోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే.. ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని సీఎం అన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని సీఎం పేర్కొన్నారు.