సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్ నుంచి పూరించబోతున్నారు. ఇప్పటికే మాకు అపూర్వ ప్రజా స్పందన వస్తున్నది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. అభ్యర్థ్ధుల ప్రకటన బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసానికి, గెలుపు పట్ల ఉన్న ధీమాకు నిదర్శనం.
-మంత్రి హరీశ్రావు
మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ పసిగట్టలేరని, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ మెజార్టీ సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ బుధవారం మెదక్లో నూతనోత్సాహంతో జరుగుతుందని తెలిపారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సభ సీఎంకు కృతజ్ఞత చెప్పే సభ కాదని, కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్ నుంచి పూరించబోతున్నారని తెలిపారు. అభ్యర్థ్ధులను ప్రకటించిన తర్వాత జరుగుతున్న మొదటి సభ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ను ఆశీర్వదించడమే కాదు.. మూడోసారి ముచ్చటగా అధికారంలోకి తెచ్చేందుకు శంఖారావాన్ని పూరించేది ఇదే సభ అని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే తమకు ప్రజా స్పందన వస్తున్నదని, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైనట్టు తెలిపారు. అభ్యర్థ్ధుల ప్రకటన అనేది కూడా ఆత్మవిశ్వాసానికి, గెలుపు పట్ల ఉన్న ధీమాకు నిదర్శనమని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఏకకాలంలో ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థ్ధులను ప్రకటించిన దాఖలాలు లేవని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. క్యాడర్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నదని, బీజేపీ డీలా పడిందని అన్నారు. గోబెల్స్ ప్రచారంతో గెలవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితిగా మారిందని, దేశ రైతులంతా సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్రావు అన్నారు. ఇప్పటికే కేంద్రం రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, జిల్లాకో మెడికల్ కళాశాలను తెలంగాణ నుంచి కాపీ కొట్టిందని తెలిపారు. కులవృత్తులకు తెలంగాణ సర్కారు లక్ష సాయం చేస్తుంటే, కేంద్రం కాపీ కొట్టి అప్పుగా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దమ్మున్న లీడర్ అయినందునే సీఎం కేసీఆర్ మెజార్టీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారని, దీంతో బీజేపీ, కాంగ్రెస్లో ఆందోళన మొదలైందని పేర్కొన్నారు. ఆ పార్టీలకు అభ్యర్థులు, క్యాడర్ కరువైందని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 స్థానాలు గెలిచామని, ఈ సారి పదికి పది గెలిచి సీఎం కేసీఆర్కు కానుక ఇస్తామని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాలను ఆదుకుంటున్నదని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు, కూలీలు, చిరు వ్యాపారులను ఆదుకుంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు బలం రైతులు, మహిళలు అని, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పార్టీకి జై కొడుతున్నారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే సీఎం కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.