CM KCR | గజ్వేల్ : గత 24 ఏండ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాను, కృషి చేశాను. అవన్నీ ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో ఇది నా చివరి సభ.. ఇది 96వ సభ. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒకసారి చెప్పాలి. గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాను. కృషి చేశాను. అవన్నీ ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేటటువంటి ట్రిపుల్ ఆర్ కూడా మన గజ్వేల్ మీదుగానే రాబోతుందని సంతోషంగా తెలియజేస్తున్నా. 24 ఏండ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. ఆ విషయం మీ అందరికి తెలుసు అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఉద్యమ సందర్భంలో తెలంగాదణ ఎట్ల తేవాలని ఆరాట పడ్డాను. పోరాటం చేశాను. కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా తట్టుకోని, నిలబడి, మొండిగా, చివరకి మళ్లీ ధోకా చేశారని గుర్తించి, ఇక తప్పదనే నమ్మకానికి వచ్చి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే, 33 పార్టీలు మనకు అండగా వస్తే అప్పుడు దిగొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతోంది. మేం గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు. అసలు నాకర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది. అప్పటి వరకు మన రాష్ట్రం ఆకలి కడుపుతోనే ఉన్నది కదా..? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్కౌంటర్లు, రక్తపాతం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంలో 1969లో 400 మందిని కాల్చి చంపింది. ఇవన్నీ కావాలని మళ్లీ కోరుతున్నారు. ఇది ఎట్ల ఉందంటే తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లనే జరగాలని అన్నడట యెన్కటికి ఒకడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. కానీ గెలిస్తే మటుకు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నారు అని కేసీఆర్ ధ్వజమెత్తారు.