Satyavathi Rathod | తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో బంజారా సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని.. భవిష్యత్లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్, సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు ఇవ్వడంతో పాటు తెల్లరేషన్కార్డు దారులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.
కాంగ్రెస్ పాలనలో బంజారాలకు చేసిందేమీలేదని, మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కర్నాటక తరహాలోనే కరెంటు కష్టాలు తెలంగాణలో పునరావృతమవుతాయన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని.. అక్కడ ఐదుగంటల కరెంటు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో 3గంటల పార్టీ కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అంటున్నాడన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ 24గంటల పాటు రైతాంగానికి ఉచిత విద్యుత్ను అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. రైతులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
ఆ పార్టీకి మాత్రం రైతులపై ఎలాంటి మమకారం, చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో తండాలను జీపీలుగా చేసిన నేత సీఎం కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో లంబాడా జాతికి ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు బీజేపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేదని, పదేళ్లపాటు గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా కాలయాపన చేసి ద్రోహం చేసిందన్నారు. నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన పరిస్థితి నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత స్వయం పాలన దిశగా అడుగులు పడ్డాయన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతిని ప్రజలు ఆశీర్వదించి.. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.