న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు చండీగఢ్కు వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఇరువురు నేతలు చండీగఢ్ పయణమవుతారు.
ఈ సందర్భంగా రైతు ఉద్యమంలో ప్రణాలర్పించిన సుమారు 6 వందల రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం ఢిల్లీ చేరుకుంటారు.
దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 26న సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. మే 27న రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్తారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. ఈనెల 29 లేదా 30వ తేదీన బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు.