హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని స్పష్టం చేశారు. లోక్సభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం కేంద్రాన్ని నిలదీయాలన్నారు.
విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని సీఎం తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన పౌరసరఫరాల శాఖ సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలువాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్., టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె ఆర్ సురేశ్ రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.