ధర్మపురి : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామ అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రత్యేకంగా ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ రవితోనూ మాట్లాడి.. గ్రామాన్ని సందర్శించి, అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించడంతో పాటు అవసరమైన పనులను గుర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మాధురి, పంచాయతీ అధికారి హరికిషన్, ఇతర జిల్లా అధికారులు మద్దనూరు చేరుకొని.. గ్రామం మొత్తం కలియదిరిగారు. జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు గ్రామంలో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో సమావేశమయ్యారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు స్వగ్రామం మద్దునూరు. మారుమూల గ్రామాన్ని మోడల్ విలేజ్గా మార్చాలన్నదే ఆయన కల. బుధవారం సీఎం కేసీఆర్ను కలిసిన సందర్భంలో దామోదర్రావు మద్దునూర్ గ్రామం గురించి ప్రస్తావించారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్.. మంత్రి కొప్పులతో చర్చించారు. అధికార బృందాన్ని గ్రామానికి పంపి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్తోనూ మాట్లాడారు. దీంతో అధికార బృందం గ్రామంలో దాదాపు 3గంటల పాటు పర్యటించి, చేపట్టాల్సిన పనులను గుర్తించారు.
మద్దునూర్ గ్రామ పంచాయతీ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. వీధివీధిలో తిరుగుతూ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని సందర్శించి, వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మద్దునూర్ గ్రామానికి చెందిన దీవకొండ దామోదర్రావు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికకావడం గ్రామస్తుల అదృష్టమన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు మద్దునూర్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నివేదిక తయారు చేసి పంపాలని సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ ఆదేశించినట్లు చెప్పారు.
కలెక్టర్తో పాటు జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించి, గ్రామస్తుల నుంచి విజ్ఞాపనలు తీసుకున్నారు. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న హైస్కూల్ బిల్డింగ్ స్థానంలో నూతన తరగతి గదుల నిర్మాణం, గ్రామంలో 3.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం, 1.5 కిలోమీటర్ల డ్రైనేజీ, 1.5 కిలోమీటర్ డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్, మద్దునూర్ – గోపులాపూర్, మద్దునూర్ – బీర్సాని లింక్ రోడ్లు, గోదావరి నుంచి మద్దునూర్ వరకు ఎత్తిపోతల పథకం, తుమ్మల చెరువు, ఊర చెరువు మత్తడి వద్ద మినీ వంతెన నిర్మాణాలు అవసరమని గుర్తించారు. అలాగే ప్రజారోగ్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రెండు అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు, బస్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సంబంధిత పనులకు సంబంధించి నివేదిక తయారు చేసి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీపీ బాదినేని రాజమణి, జడ్పీటీసీ రాజేందర్, సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ మహేశ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.