CM KCR | ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడంతో వేసిన రైతులు వేసి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని శాసనసభ్యులు, మంత్రులు సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భేటీలో సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చించారు.
తెలంగాణ వాటా కింద కృష్ణా జలాల్లో నీరు ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. వానలు కురవకపోవడంతో, సాగర్ రిజర్వాయర్లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా, సాగునీటిని ఒడుపుగా పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. సాగర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు నియోజకవర్గాల్లో పర్యవేక్షిస్తూ చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.