హైదరాబాద్: భారతదేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద ఉందని, కానీ దాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మనదేశంతో పోల్చుకుంటే ఒక రాష్ట్రం అంత కూడా ఉండని ద్వీపదేశం సింగపూర్.. పర్యాటకంలో ఎంత అభివృద్ధి సాధించిందో చూసి సిగ్గుతో చచ్చిపోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన విమర్శించారు. అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్న భారత్కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎంత? సింగపూర్ సందర్శకుల సంఖ్య ఎంత? అని ప్రశ్నించారు.
తాను కూడా సింగపూర్ వెళ్లానని అక్కడ అంతగొప్పగా తనకేమీ కనిపించలేదని చెప్పారు. ఆ దేశం సముద్రాన్ని ఆక్రమించడం కోసం మట్టిని కూడా పక్క దేశాల నుంచి కొనుక్కుంటోందని, అలాంటి పరిస్థితిలో కూడా వారికి మిగులు బడ్జెట్ ఉంటోందని వివరించారు. ఏటా బడ్జెట్లో మిగిలిన డబ్బును అక్కడి ప్రజలకు పంచిపెడుతున్నారని చెప్పారు.
సింగపూర్లో 190 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, అయితే అక్కడ 5.5 కోట్లపైగా కంటైనర్లను హ్యాండిల్ చేస్తున్నారని వెల్లడించారు. మన దేశానికి 7500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా సరే ఇక్కడ హ్యాండల్ చేసే కంటైనర్ల సంఖ్య లక్షల్లోనే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం పట్ల బాధతోనే తాను ఈ విషయాలు వెల్లడిస్తున్నానని, ఇవన్నీ కూడా పచ్చి నిజాలని కేసీర్ తెలిపారు.
‘ప్రపంచంలోనే అత్యంత శుభ్రంగా ఉండే బీచ్. దాని పేరు బంగర్ ఐలాండ్. మన లక్షద్వీప్లో ఉంటుంది. అది ప్రపంచంలోనే క్లీనెస్ట్ బీచ్. కానీ మనకు ఒక్క టూరిస్టు రాడు ఏం ఖర్మ? ఎందుకని ఆకర్షించలేకపోతున్నాం?’ అని ప్రశ్నించారు.
‘భారత్లో ఎంతో చారిత్రక సంపద, శిల్ప సంపద, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రకృతి సంపద, ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఒక్క రామప్ప దేవాలయనాకి యునెస్కో గుర్తింపు రావాలంటే దశాబ్దాలా? తెలంగాణ వచ్చే వరకూ ఆ గతి కూడా లేదు. పాపారావు అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాతో కూడా లెటర్లు రాయించి, అంతర్జాతీయ స్థాయి వరకూ వెళ్లి పడరాని పాట్లు పడితే మొన్న ఆ గుర్తింపు వచ్చింది. అది కూడా మేమే చేశాం అని కేంద్రం అనడానికి సిగ్గుపడాలి’ అని విమర్శించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంలో కేంద్రం పాత్ర అసలు ఉందా? కనీస ప్రయత్నం చేశారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.