హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఉదయం 11.56 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల బరువుగల ఓషన్ శాట్-3 (ఈవోఎస్-06) ఉపగ్రహంతోపాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకువెళ్లింది. ఓషన్ శాట్తోపాటు భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ దేశపు ఉపగ్రహం భూటాన్శాట్, అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ తయారుచేసిన నాలుగు అస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలను, బెంగళూరుకు చెందిన పిక్సెల్ సంస్థ రూపొందించిన ఆనంద్ శాట్ను నింగిలోకి పంపారు. అలాగే హైదరాబాద్కు చెందిన ధ్రువ సంస్థ రూపొందించిన థైబోల్ట్ శాట్-1, థైబోల్ట్ శాట్-2 ఉపగ్రహాలున్నాయి. ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ‘ధ్రువ’ స్పేస్టెక్ సంస్థను అభినందించారు. ప్రైవేటు రంగం ద్వారా ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో ఇదో మరో గొప్ప విజయమన్నారు. ‘విక్రమ్-ఎస్’ శాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ కంపెనీ చరిత్ర లిఖించిందన్నారు. భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్ స్టార్టప్ సంస్థలు ద్వారాలు తెరిచాయని, ప్రపంచ స్పేస్ ఎకానమీలో విక్రమ్-ఎస్, తైబోల్డ్-1, తైబోల్ట్-2 ప్రయోగాలు శుభారంభం చేశాయన్నారు. ఈ రెండు ఉపగ్రహ ప్రయోగాలు తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటాయని, ఈ ప్రయోగాలతో స్టార్టప్ సిటీగా హైదరాబాద్ విశిష్టత రెట్టింపయ్యిందన్నారు.
ఔత్సాహికుల్లో ప్రతిభ, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో టీ హబ్ భవిష్యత్లో మరెన్నో మైలురాళ్లు సాధిస్తాయని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాలకు ఇది ఆరంభమన్న సీఎం కేసీఆర్.. ‘స్కైరూట్’, ‘ధ్రువ’ స్పేస్ స్టార్టప్ల సంస్థల ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యువత తమ మేధస్సును దేశాభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి తమ ప్రతిభ చాటుతూ దేశకీర్తిని ఇనుమడింప చేసేందుకు యువతకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో యువత ప్రతిభను వెలికి తీసేందుకు కృషిచేస్తున్న ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు, టీహబ్ సిబ్బందిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.