KCR : కరీంనగర్లో మేం జలధారలు సృష్టించి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించామని.. ఇప్పుడు కేవలం నాలుగైదు నెలల్లోనే ఆ జలధారలు ఎందుకు ఎడారులుగా మారినయని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రశ్నించారు. ‘కేసీఆర్ పొలం బాట’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలతో ఎండిన పంటలను పరిశీలించారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. ప్రెస్మీట్కు ముందు ఆయన బాబూజగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.
‘ఐదారెండ్ల క్రితం కరీనంగర్కు వచ్చినప్పుడు టౌన్లో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టంగా ఒకమాట చెప్పిన. అప్పుడు నేను, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, నాటి గవర్నర్ నరసింహన్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినం. తర్వాత కరీంనగర్కు వచ్చి మీడియాతో మాట్లాడిన. కాళేశ్వరం పూర్తయినందున ఈ జిల్లాలో ఇక నీళ్లకు డోకా ఉండదు, జిల్లాలో నాలుగు సజీవ జలధారలు అమృత ధారలుగా ఉంటయి, నిరంతరం ఈ జిల్లాను కాపాడుతయని చెప్పిన. ఆ సజీవ జలధారలను మేం సృస్టించినం. జిల్లా ప్రజలు వాటి ఫలితాలను అనుభవించిండ్రు’ అని కేసీఆర్ తెలిపారు.
‘ఆ నాలుగు సజీవ జలధారల్లో ఒకటి మానేరు వాగు. అప్పర్ మానేరు జలాశయం వద్ద మొదలై అన్నారం బ్యారేజీ దగ్గర గోదావరిలో కలిసే వరకు నిరంతరం నీళ్లతో కళకళలాడుతదని చెప్పిన. రెండో జలధార వరద కాలువ. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న వరద కాలువను పూర్తిచేయడమేగాక శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకమనే పేరుతో ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి ఒకటిన్నర టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడుగూత నిండి ఉండేటట్టు చేసినం. ఇక సంవత్సరానికి తొమ్మది నుంచి తొమ్మదిన్నర నెలల వరకు నిండు గర్భిణిలా ప్రవహించే కాకతీయ కాలువ. అది మూడో సజీవ జలధార. గోదావరి మీద నర్మించిన బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తికావడం, ఎస్సారెస్పీకి నీళ్లు తక్కువైతే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా పునరుజ్జీవం రావడంతో గోదావరి నది 200 కిలోమీటర్లపాటు నిండు జలాలతో ఉండేది. అది నాలుగో సజీవ అమృత ధార. ఈ నాలుగు ధారలు ఏవిధంగా నిండి ఉండెనో, గత ఐదారేళ్లు ప్రజలు వాటిని ఎలా అనుభవించిండ్రో యావత్ ప్రజానీకానికి తెలుసు’ అని కేసీఆర్ అన్నారు.
‘ఇన్ని జలధారలు సృష్టించి, నాలుగైదేండ్లు చక్కటి ఫలితాలు లభించి, లక్షల టన్నుల ధాన్యం పండించి, ఎంత కావాలంటే అంత తాగునీరు అనుభవించిన కరీంనగర్ ప్రజలు నాలుగైదు నెలల్లోనే ఏం జరుగుతున్నదో చూస్తున్నరు. ఈ జలధారలు ఎడారులుగా మారిపోయినయ్. మిడ్మానేరు బ్రిడ్జి మీద నిలబడితే ఒక సముద్రంలో నిలబడిన ఫీలింగ్ ఉండేది. అది ఎండిపోవడంతో మునిగిపోయిన ఊర్లు తేలినయ్. దాన్ని ఒక శ్మశానంలా తయారు చేసిన్రు. లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండెనో, ఎండకాలం తర్వాత కూడా సగం డ్యామ్ ఎట్ల నిండి ఉంటుండెనే, చుట్టుపక్కల పట్టణాలకు నీళ్లను ఎలా ఇచ్చిందో అంతా చూసిన్రు. గంగుల కమలాకర్ ఇంటికి భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ మేయర్, కార్పొరేటర్లు, ప్రజలు చెప్పిన్రు. రోజూ నీళ్లు వచ్చేయి సార్ కరీంనగర్ టౌన్లో.. ఇప్పుడు రోజుమార్చి రోజు ఇస్తున్నరు, ఇంక ముందు మూడు రోజులు, నాలుగు రోజులకు ఇస్తరేమోనని భయమైతున్నది అని చెప్పిండ్రు’ అని కేసీఆర్ వెల్లడించారు.
‘నిండు జలాలతో కళకళలాడిన రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినయ్..? ప్రస్తుతం ప్రభుత్వం తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చవట విధానాలవల్ల, అర్బకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. 2014కు ముందు తెలంగాణలో ఏ గోస ఏ ఏడుపు ఏ బాధ, ఏ మంచి నీళ్ల ట్యాంకర్లు, ఏ బిందల కోట్లాటలు, ఏ కాలిపోయిన మోటర్లు కనబడుతుండెనో ఇప్పుడు అదే పరిస్థితి కనబడుతున్నది’ అని ఆయన మండిపడ్డారు.