CM KCR | కంటి వెలుగు పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదని, దీని వెనుక ఎంతో పరమార్థం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. మహబూబ్నగర్ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘చక్కటి పరిపాలన భవనాన్ని మంజూరు చేసుకోవడమే కాకుండా పూర్తి చేసుకొని.. ప్రారంభోత్సవం చేసుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నా.
ఏడేళ్ల క్రితం 60వేలకోట్ల రూపాయల బడ్జెట్ ఉండే తెలంగాణ.. నేడు 2.50లక్షల కోట్ల వరకు ఖర్చుపెట్టే వరకు రాగలిగాం. ఏడేళ్ల కిందట చాలా భయంకరమైన కరెంటు బాధలు అనుభవించిన తెలంగాణ నేడు.. దేశానికే తలమానికంగా, మనకు సమీపంలో ఏ రాష్ట్రం లేనివిధంగా, నేషనల్ యావరేజ్ క్లోజ్గా లేకుండా దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పేందుకు గర్వపడుతున్నా. సంక్షేమ పథకాల్లో సాటిగానీ, పోటిగానీ లేరు. ఎవరికీ అలాంటి ఆలోచనలురావు. నిబద్ధతతో పని చేసినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, వారితో పాటు రెండింతల అకింతభావంతో పనిచేసినటువంటి ప్రభుత్వ సిబ్బంది. ఇంత గొప్ప ఆవిష్కరణ చేసినందుకు ప్రభుత్వ అధికారులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’నన్నారు.
‘తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లా పర్యటించిన సమయంలో అనేక జ్ఞాపకాలు. ఆలంపూర్ నుంచి జోగులాంబ వరకు పాదయాత్ర తెలంగాణ ఉద్యమంలో తొలిభాగంలో చేస్తే అనేకమైన అనుభవాలు, బాధలు. జ్ఞాపకం చేసుకుంటే ఒళ్లు జలధరించే పరిస్థితి. నడిగడ్డలో ప్రజల పరిస్థితి చూసి నిరంజన్రెడ్డి, నేను అంతా కండ్లనీళ్లు పెట్టుకున్నాం. వేధనలు, రోధనలు, గుండవిసేలా బాధలతోని బాధపడ్డ పాలమూరు జిల్లా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో పంటల కోతలు కోసే హార్వెస్టర్లు, కల్లాల్లో ధాన్యం రాశులు చూసి ఆనందపడ్డా.
ఏ తెలంగాణ కావాలని కోరుకున్నమో.. దేనికైతో పోరాడమో అది సాకరమవుతుంది. అద్భుతమైన లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నాం. ఎవరం కూడా వెయ్యి సంవత్సరాలు బతికేందుకు రాలేదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకాయన అటెండర్ కావొచ్చు. ఒకాయన ఎమ్మార్వో, ఇంకో ఆయన జాయింట్ కలెక్టర్, ఒకాయన మంత్రి, మరొకాయన సీఎస్, మరొకాయన చీఫ్ మినిష్టర్ కావొచ్చు. ఇవి శాశ్వతం కాదు. ఎవరం అధికారంలో ఉండం. ఒక స్టేజీ తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఉద్యోగులూ రిటైర్డ్ కావాల్సిందే. మనం ఉన్నప్పుడే ఏం చేసిందనేదే ఎండ్ ఆఫ్ ది డే. అద్భుతమైన వేల, లక్షలకోట్ల ఆస్తికి సమానమైన సంతృప్తి. మేం ఉన్నప్పుడు ఇది చేశాం, మా వల్ల ఇది కాగలిగింది అనేది సంతృప్తినిచ్చేది’ అన్నారు.
‘అనేక మంది మహనీయులు అనేక రకాల కృషి చేసి.. బాటలు వేశారు. పీవీ నర్సింహరావు తెలంగాణగడ్డలో పుట్టి ప్రధాని స్థాయి వరకు ఎదిగారు. విద్యాశాఖ మంత్రి ఉన్న సమయంలో రెసిడెన్షియల్ పాఠశాలలే అద్భుతమైన ప్రగతికి దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లాలో సర్వేల్ రెసిడెన్షియల్ కాలేజీని పెట్టించారు. ఇవాళ మహేందర్రెడ్డి డీజీపీ స్థాయి వరకు ఎదిగాడంటే పీవీగారు పెట్టించిన సర్వేల్ స్కూల్ పుణ్యం. పీవీగారి గురుకుల విద్య ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. అందరికీ ఉపయోగపడేలా ఏర్పాటు చేసుకున్నాం. బీసీల రెసిడెన్షియల్స్ ఇంకా విస్తృత పరచాల్సి ఉన్నది. రాబోయే వాటి సంఖ్యను మూడు నాలుగు రెట్లు పెంచుతాం’ అన్నారు.
‘గజ్వేల్లోని చిన్న గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేద్దామంటే.. ఊరివాళ్లకు మంచి విశ్వాసం కల్పించాలనే మంచి ఆలోచనతో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టాం. ఈ చిన్న ఊరులో 127 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో 27 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదువతలేరని స్కూల్లో టీచర్లు, ఇండ్లల్లో తల్లిదండ్రులు కొడుతున్నరు. దీనిపై చాలా బాధపడి ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడాం. వాస్తవానికి కంటి విషయంలో చాలా దయనీయమైన పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందరికీ సరోజిని దవాఖాన. అంతకు మించి ఏమీ లేదు. ఆ తర్వాత చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చాం. చిల్లరమల్లర రాజకీయాలు, ఓట్ల కోసం తెచ్చింది కాదు. మళ్లీ రెండోదశ చేపట్టబోతున్నాం. జిల్లా కలెక్టర్లు, అధికారులు విజయవంతం చేయాలని కోరుతున్నా’నన్నారు.
‘కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం పెట్టుకున్నాం. మామూలుగా నాలుగు వస్తువులు ఇచ్చి పంపడం కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మానవీయ కోణంలో ఏ పని చేసినా దాని వెనుక చర్చ, మధనం, ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథంతో చేస్తాం. ఎవరో చెప్పారనో.. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో చేయం. పేదింటి ఆడబిడ్డలు ఎప్పుడైతే గర్భం దాల్చిన తర్వాత కూడా పని చేస్తారు. పని చేస్తే ఆ గర్భిణులకు, జన్మించే శిశువు మంచిది కాదు. ఎందుకు పని చేస్తరున్నరనే విషయంపై అధ్యయనం చేశాం.
కలిగిన వాళ్ల బిడ్డలకు ఏమో ఇంట్లోని వాళ్లు శ్రీమంతాలు వగైరా పండగలు చేస్తారు. ‘ఈమె నీళ్లుపోసుకున్నదయ్య ఇప్పుడు కూసుండబెట్టి తిండిపెట్టాలే’.. ఇది పేదింట్లో వచ్చే మాట.. నేను కూడా పల్లెటూరులో పుట్టాను కాబట్టి.. నా చెవులతో విన్నకాబట్టి. ఎందుకంటే పేదరికం, దరిద్య్రం వల్ల. అలాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్లు పని చేయవద్దంటే ఒకటి ఇనిస్టిట్యూషన్ డెలివరీలు ప్రోత్సహించాలి. మరొకటి మహిళ పని చేయకపోవడం ద్వారా ఏదైతే డబ్బు కోల్పోతదో దాన్ని మనం ఇవ్వాలనేదే కేసీఆర్ కిట్ ఉద్దేశం.
స్మితాసబర్వాల్తో పాటు మహిళా ఐఏఎస్ అధికారులను పలు రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేశాం. గర్భవతులైన పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి.. వాళ్లకు సంభవించే వేజ్ లాస్ను సామాజిక బాధ్యతగా ప్రభుత్వమే పూర్తి పూర్తి చేస్తుంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు పెరిగేలా అమ్మ ఒడి వాహనాలను తీసుకువచ్చాం. గర్భం దాల్చినప్పటి నుంచే సేవలు అందించడంతో పాటు మళ్లీ ప్రసవం, కేసీఆర్ కిట్ అందించి తల్లీ బిడ్డను ఇంటి వద్ద దింపి రావడం భారతదేశంలో ఒక తెలంగాణలోనే ఇది సాధ్యమవుతున్నది’ అన్నారు.
‘ఏరకమైన కార్యక్రమం తీసుకున్నా మానవీయ దృక్పథంతో.. ప్రజలకు మేలు జరుగాలి. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి వారి సేవకు వెళ్లాలని చెప్పి మేధోమథనం చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. సంస్కరణలు అనేది అన్ ఎండింగ్ ప్రాసెస్. మానవజాతి భూమిపై ఉన్నన్ని రోజులు సంస్కరణలు కొనసాగుతాయి, దానికి అంతం ఉండదు. ఎప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేధోమధనం చేసి కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకువస్తారు.
ఎప్పటికప్పుడు మేధో మధనాన్ని, ఆలోచనలను కలబోసుకోని అందరు కలిసి ఆత్మీయంగా, ప్రేమతో పని చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమంత్రో, ఒక మంత్రో, ఎమ్మెల్యేనో, కలెక్టరో అనుకుంటే ఏమీ జరుగదు. అందరు కలిసి టీమ్ వర్క్ చేసే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం. ఏడేళ్ల కిందట మన బడ్జెట్ ఎందో తెలియదు, ఎకనామిక్ ట్రెండ్ ఏంటో తెలియదు. మనకు శాపాలు పెట్టిన వారున్నారు.. దీవెనలు పెట్టిన వారున్నారు. ఇప్పుడున్నది అందరి సమష్టి కృషి ఫలితం. పాలమూరు జిల్లా అద్భుతంగా రూపాంతరం చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది’ అన్నారు.