హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రాణం పోయినా వదలం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణలో అతిపెద్ద కులం దళిత కులం. 75 లక్షల మంది జనాభా దళితులు ఉన్నారు. అందరీ కన్నా తక్కువ భూమి దళితుల వద్ద ఉంది. 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే దళితుల వద్ద ఉంది. 9 శాతం మంది ఉన్న గిరిజనుల వద్ద 22 లక్షల ఎకరాల భూమి ఉంది. దళితుల వద్ద 13 లక్షల ఎకరాల భూమి కూడా ఉందో లేదో తెలియదు. లెక్క తీస్తే తెలుస్తది. దళితులను బతుకనివ్వలేదు. జనాభా ఎక్కువ ఉన్నది. అవకాశాలు తక్కువ ఉన్నాయి.
అంబేద్కర్ పుణ్యమా అని ఎస్సీలకు రిజర్వేషన్ ఫలాలు అందాయి. అంబేద్కర్ పుణ్యంతో కొంతమంది పిల్లలు చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందారు. కొందరు ఎమ్మెల్యేలు అయ్యారు. అట్టడుగు స్థాయిలో ఉన్న వారి కోసం అంబేద్కర్ పోరాటం చేశారు. తెలంగాణ తేవడం ఎంత పెద్ద యజ్ఞమో.. దళిత బంధును విజయవంతం చేయడం అంతే పెద్ద యజ్ఞం అని అన్నాఉరు. ప్రాణం పోయినా దళిత బంధును వదలం. సంవత్సరానికి కొంత మందికి అమలు చేస్తాం. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి వంద మందికి కచ్చితంగా ఈ పథకం అమలు చేస్తాం.
వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. ఈ ఏడేండ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు రూ. 23 లక్షల కోట్ల బడ్జెట్ ఉటుంది. వచ్చే ఏడేండ్లలో రూ. 1.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపాం. అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తాం. దళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.