కామారెడ్డి : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR) బుధవారం కామారెడ్డి (Kamareddy) జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కుర్ మండలం తిమ్మాపూర్ లో తెలంగాణ తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు(Brahmotsavams) హాజరవుతారని సీఎం కార్యాలయ అధికారులు కామారెడ్డి జిల్లా అధికారులకు సమాచారం పంపారు.
సీఎం రేపు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలు దేరి ఉదయం 10.40 గంటలకు బాన్సువాడకు చేరుకుంటారని వివరించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిమ్మాపూర్లోని తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కేసీఆర్ (CM KCR) పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది.
హనుమంతుని వాహనంపై శ్రీరాముని అవతారంలో ఊరేగింపు..
తిమ్మాపూర్ గ్రామం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవరోజు మంగళవారం శాసన సభాపతి(SPEAKER) పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగారు. స్వామివారి విగ్రహాలను ఉంచిన ట్రాక్టర్ను స్పీకర్ పోచారం స్వయాన నడిపారు.