హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ఒక భాషకో, ప్రాంతానికో, వ్యక్తికో కాదు. ఇది ఒక యజ్ఞం. కష్టాలు, నష్టాలు రావొచ్చు. ఏ గొప్ప పని ప్రారంభించినా అవహేళనలు ఎదురవుతాయి. మనం ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత కొంచెం హేళన చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మన మీద దాడి చేస్తారు. చివరకు మనకు విజయం చేకూరుతుంది. మనకు భవిష్యత్లో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. విడమరిచి చెప్పే లెక్చరర్లు ఉంటారు. ఎందుకు బీఆర్ఎస్ అని చెప్తారు అని కేసీఆర్ తెలిపారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఈ రోజు మన దేశం యొక్క లక్ష్యం ఏమిటి? మనం ఆలోచిస్తున్నామా ఆ వైపుగా, ఇంత పెద్ద సువిశాల దేశానికి సామూహిక లక్ష్యం ఉండాలి కదా. లక్ష్యాన్ని సాధించే దిశగా పురోగతి ఉండాలి. ప్రగతి కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించి, ప్రజల ముందు పెట్టి, వారి నుంచి స్వీకరించి ముందడుగు వేయాలి. మన దేశ లక్ష్యం ఎన్నికల్లో గెలవడమే అయింది. లక్షల అబద్ధాలు, కోట్ల డబ్బులు గుమ్మరించొచ్చు. మత కల్లోలాలు రేపొచ్చు. ఏదైనా చేసి.. ఎన్నికలు గెలవడమే లక్ష్యం అయిపోయింది. ఇదేనా మనకు కావాల్సింది. రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఈ దేశంలో ఎవరు సంతోషంగా ఉన్నారు. 13 నెలలు రైతులు ధర్నాలు చేసి చనిపోయారు. కనీసం సానుభూతి తెలపలేదు. కుటుంబాలను ఓదార్చే పని చేయలేదు. దళిత, గిరిజన సమాజం, నిరుపేదలు రోదిస్తున్నారు. ఎందుకీ వేదన. చాలా మందిలో ఒక రకమైన అసంతృప్తి. ఎస్సీల్లో కలపాలని రజకులు అంటున్నారు. ఉన్నోళ్లందరినీ ఎస్సీల్లో కలిపిస్తే మరి వారు ఎక్కడికి వెళ్లాలి. ఎందుకు ఈ పరంపర. రెండు ఉద్యోగాలు వస్తాయనే బాధ, దాన్నుంచి వస్తున్నటువంటి ఆక్రనందనలు అవి. ప్రజలను తప్పుబట్టే హక్కు మనకు లేదు అని కేసీఆర్ తెలిపారు.