హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్ట్లు, చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం… ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో 24 గంటల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. హెలీపాడ్లను సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు.