హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని చెప్పారు. హద్దూ అదుపు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మార్గనిర్దేశనం చేశారు. దేశంలో 5 రాష్ర్టాల ఎన్నికలు పూర్తి కాగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్ ధరలు పెంచుతుందని, ఇందుకు రంగం సిద్ధం చేసిందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రగతిభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. సామాన్యుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని టీఆర్ఎస్ ఇటీవల అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు అండగా నిలవాలని, కేంద్రం ఇష్టానుసారం పెంచే ధరలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించిం ది. ఇందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు అధినాయకత్వం దిశానిర్దేశం చేసింది.