CM KCR | కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ఒక్కటై.. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కోదాడలో ఒక బీసీకి అవకాశం రాలేదు. పీహెచ్డీ వరకు చదివిన విద్యావంతుడని పిలిచి టికెట్ ఇచ్చాను. మీరు దీవిస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ మధ్యనే ఉన్నడు తోచిన పనులు చేస్తున్నడు. ప్రభుత్వం అందించే కార్యక్రమాలు, ఆయనగా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.
మల్లయ్య యాదవ్ గెలువడు అని ఆరు నెలలుగా నా వద్దకు వచ్చి గునుగుడు.. మంత్రి వద్దకు వచ్చి గునుడు. గెలవకపోతే గెలువకపాయే.. నేను టికెట్ ఇస్తా.. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని చెప్పాను. ఇవాళ కోదాడ నియోజకవర్గంలో చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న, నిరుద్యోగులు, రిటైర్డ్ బీసీ చైతన్యం కనపడాలి. మేము 50శాతం, 60 శాతం ఉన్నమని నరుకుడు కాదు.. రుజువు చేసి చూపించాలి. కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ప్రతి కుటుంబంలో, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఇంట్లో చర్చ జరగాలి. కేసీఆర్ చెప్పింది నిజమా? ఎవరు గెలవాలి ? ఎవరు ఓడిపోవాలి ? అనే చర్చ చేయాలి.
60శాతం, 70శాతం బీసీ సామాజిక, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపావాలి. ఆ చైతన్యాన్ని చూపెట్టే బాధ్యత కోదాడ మీద ఉన్నది. కోదాడలో విజయ బావుటగా ఎగుర వేయాలి. మల్లయ్య యాదవ్ ఇప్పుడే నన్ను కోరారు. అగ్రకులాలతో పాటు పెద్ద సంఖ్యలో బీసీ కులాల ప్రజలు ఉన్నరు. ప్రత్యేకంగా కోదాడ కోసం బీసీ భవన్ను మంజూరు చేయాలని కోరారు. మల్లయ్య యాదవ్ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తే రూ.10కోట్లతో కోదాడలో బీసీ భవన్ను కట్టించే బాధ్యత నాది. బీసీ చైతన్యాన్ని చూపించాలి.. చూపిస్తారనే నమ్మకం నమ్మకం ఉంది’ అన్నారు.